నా వల్లే టీడీపీ ఓటమి, నన్ను ఎవరూ ఓడించలేకపోయారు: బాబు ఆసక్తికరం
తనను ఎవరూ ఓడించలేకపోయారని, కానీ ఏదో చేద్దామన్న తొందరలో గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు.
అమరావతి: తనను ఎవరూ ఓడించలేకపోయారని, కానీ ఏదో చేద్దామన్న తొందరలో గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు అన్నారు. మరో ఇరవై ఏళ్ల వరకు మా ప్రభుత్వమే ఉంటుందన్నారు.
ప్రజలకు మంచి చేద్దామన్న తొందర్లో గతంలో కొన్ని పొరపాట్లు చేశానని, వాటి కారణంగా ఓడిపోయామే తప్ప, మరే విధమైన కారణాలు కావని చెప్పారు. తనను ఓడించిన వ్యక్తులు లేరని తేల్చి చెప్పారు. తద్వారా తన తప్పులే తనను ఓడించాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
పావులు కదుపుతున్నారు: 40మంది ఎమ్మెల్యేలతో నారా లోకేష్ భేటీ
చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో ఉద్యోగులపై కఠిన వైఖరి, వ్యవసాయం కంటే టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారనే తదితరాల కారణంగా ఓడిపోయారనే వాదనలు ఉన్నాయి.
కియాతో ఒప్పందం
దక్షిణ కొరియా దిగ్గజ కార్ల సంస్థ కియా మోటార్స్ నవ్యాంధ్రకు రానుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కియా కార్ల తయారీ సంస్థ ప్రతినిధులురాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
కియా మోటార్స్ కోసం తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడ్డప్పటికీ చివరకు ఈ సంస్థ ఏపీలోనే తమ ప్లాంట్ను నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది.
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద కియా కార్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఇందు కోసం 600 ఎకరాల స్థలం గుర్తించింది.
దాదాపు 12 వేల కోట్ల పెట్టుబడితో ఈ కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.