అమరావతికి నేనొస్తా: బాబుతో మోడీ, 30 రోజుల్లో 60 అంతస్తుల చైనా టెక్నాలజీ
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు నేను వస్తున్నానని, అదే రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానని ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చెప్పారు. సోమవారం సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని కలిశారు. రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించారు.
విజయ దశమి రోజున అమరావతి శంకుస్థాపనకు రావాలని ప్రధాని మోడీని ఆహ్వానించానని, మధ్యాహ్నం 12.35 నుంచి 12.45 లోపు ఆయన వస్తానని చెప్పారని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధాని అనేక సూచనలు చేశారన్నారు.
సాగరమాల కార్యక్రమం నిమిత్తం సోమవారం ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు... ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమ రాజధాని శంకుస్థాపనకు రావాలని కోరారు. రాజధాని నిర్మాణంతోపాటు విభజన చట్టం హామీలు, పోలవరం ప్రాజెక్టు నిధుల మంజూరు తదితర అంశాలపైనా చర్చించారు.
అనంతరం చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధికి ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకెళ్లడానికి రాజధాని నిర్మాణానికి రైతులు మరిచిపోలేని స్ఫూర్తి చూపారన్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. భూమి ఇచ్చేందుకు రైతులు స్వచ్చంధంగా ముందుకొచ్చారన్నారు.
వారిని సంప్రదాయబద్ధంగా ఆహ్వానిస్తామని, ఏపీలో ఐదు కోట్ల మంది ప్రజలనూ భాగస్వాములుగా చేసి, పచ్చదనం, పరిశుభ్రతలతో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మిస్తామన్నారు. విరాళాల ద్వారా గానీ, మరేదైనా రూపంలో గానీ ప్రజలందరినీ భాగస్వాములు చేయాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు.
2018 కల్లా తొలి దశ పూర్తవుతుందని, 30 రోజుల్లోనే 60 అంతస్థుల భవనం నిర్మించే సాంకేతికత చైనాలో ఉందని, దానిని ఉపయోగించుకుంటామని చంద్రబాబు తెలిపారు. రాజధాని నిర్మాణం మొదటి దశ 2018 నాటికి పూర్తవుతుందన్నారు.
విజయదశమి నాడే తిరుపతిలో రూ.170 కోట్లతో నూతనంగా నిర్మించిన విమానాశ్రయ టెర్మినల్ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారనీ, శ్రీవారిని దర్శించుకుంటారన్నారు. రాజధాని నిర్మాణంపై ప్రధాని మోడీ పలు సూచనలు చేశారన్నారు.
ప్రపంచ అత్యుత్తమ నగరాలకు అధికారుల్ని పంపడంతో పాటు, తనను కూడా సందర్శించమని చెప్పారన్నారు. దేశంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని నిర్మించాలనేది ప్రధాని ఆకాంక్ష అని, సింగపూర్ మూడు మాస్టర్ప్లాన్లు ఇచ్చిందన్నారు. ఇటీవల అభివృద్ధి చెందిన నగరాలను అధ్యయనం చేస్తున్నామన్నారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా రాజధాని నిర్మాణం జరగాలని చర్చి, మసీదు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయిస్తామన్నారు. ఆర్థిక కార్యకలాపాలతో పాటు నగర జీవితం, విద్యా, ఆరోగ్య వసతులతో రాజధాని ఉంటుందన్నారు.
ప్రధానమంత్రి, కేంద్రప్రభుత్వం సహకరిస్తే అత్యుత్తమ నగరం సాధ్యమవుతుందని, సంపూర్ణ సహకారం ఇవ్వాలని ప్రధానిని కోరానని, విభజన చట్టం హామీలు గుర్తు చేశానన్నారు. నీతిఆయోగ్ ఛైర్మన్తో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తామని చెప్పారన్నారు. పోలవరం ప్రాజెక్టుకి మరిన్నినిధులు విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు.