పెట్టుబడులు: జపాన్లో బాబు బుద్దిస్ట్ కార్డ్! అమరావతికి బ్యాంక్ శాఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఆయన పలు సంస్థలతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు.
ఏపీలో జపాన్ పెట్టుబడుల కోసం ప్రత్యేక డెస్క్ను ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. పరిశ్రమలకు నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అమరావతి కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందన్నారు.
జపాన్ నుంచి భారీగా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. రాజధాని అమరావతికి సమీపంలో రెండు కొత్త పోర్టులు నిర్మిస్తున్నామన్నారు. కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. యోకోహమా సంస్థ కాకినాడ వద్ద పోర్టు నిర్మాణం చేస్తోందన్నారు.
చంద్రబాబు ఉదయం మిజుహో బ్యాంకు ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాజధానికి తోడ్పాటు అందించే జపనీస్ కార్పొరేషన్లపై దృష్టి పెట్టామన్నారు. జపాన్లోని వ్యూహాత్మక స్థానాలపై అవగాహన ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు.
అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు. అమరావతిలో బ్యాంకు శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతి శాఖను భారత్లో ప్రధాన కార్యాలయంగా తీర్చిదిద్దాలని కోరినట్లు చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. మిజుహో జపాన్లో అతి ప్రాచీనమైన రెండో అతి పెద్ద బ్యాంకు అన్నారు. అమరావతి బుద్ధులకు పవిత్ర ప్రాంతంగా వెలిగింది. అమరావతి పేరును బాబు ఉపయోగించుకుంటున్నారు.