అమెరికాలో నన్ను లాగిపడేశారు,స్నానం చేయకుండా పరుగెత్తా: జగన్పై ఊగిపోయిన బాబు
పెట్టుబడులు తీసుకురావాలని తాను అమెరికాకు వెళితే, వైసిపి అమెరికాలో కూడా దారుణానికి వడి గట్టిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామన్న వైసిపి అధినేత వైయస్ జగన్ ఇప్పుడు ఏం మాట్లాడటం లేదని, హఠాత్తుగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు కలవాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.
చదవండి: 'బాబుపై అభిమానం, అమెరికా మేయర్ ఆశ్చర్యం: ఆత్మరక్షణలో జగన్ పార్టీ'
హోదా విషయంలో టిడిపి తప్పు చేసినట్లు మాట్లాడిన జగన్, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైసిపి నేతలు రాజీనామా చేస్తారని ప్రధాని మోడీతో తో చెప్పారా? అలా చెప్పడానికే ఆయనను కలిశారా? అని నిలదీశారు
జగన్ స్పూర్తిగా విశాఖలో భారీ స్కాం
జగన్ లాంటి అక్రమార్కులను స్ఫూర్తిగా తీసుకుని విశాఖలో హవాలా తరహా నేరాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. విశాఖలో రూ.1300 కోట్లకు పైగా భారీ స్కాం బయటపడిన విషయం తెలిసిందే.
తన ఆస్తులకు లెక్కలు చెప్పలేని జగన్ ఇతరులపై మాత్రం ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రధాని అపాయింట్మెంట్ ఎందుకు తీసుకున్నట్లు? ఎందుకు కలిసినట్లు? అని ప్రశ్నించారు.
నేను పెట్టుబడుల కోసం వెళ్తే...
పెట్టుబడులు తీసుకురావాలని తాను అమెరికాకు వెళితే, వైసిపి అమెరికాలో కూడా దారుణానికి వడి గట్టిందని, అమెరికాలోనూ తెలుగు జాతి ప్రతిష్ఠ దిగజార్చారని మండిపడ్డారు. ఇలాంటి ప్రతిపక్షం వల్ల భవిష్యత్తు ఏమవుతుందన్నారు.
డల్లాస్ పోలీసులు నన్ను లాగేసే పరిస్థితి కానీ..
అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా తప్పుడు ఈ మెయిల్స్ పంపించి విదేశాల్లో తెలుగువారి పరువు తీశారన్నారు. తాను డల్లాస్కి వెళ్లేసరికి పోలీసులు ఎవర్నీ రానీకుండా పక్కకు లాగేస్తున్నారని, తనను కూడా లాగేసే పరిస్థితి ఉండటంతో షాకయ్యానన్నారు.
జగన్ ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు కలిశారో? ఏం మాట్లాడారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి భేషరతుగా మద్దతిస్తానని ఎలా చెబుతారన్నారు.
స్నానం చేయకుండా పరుగెత్తా
మొదటి రోజు రెండు గంటలు ఆలస్యంగా అమెరికా చేరుకున్నామని, అప్పటికే సమయం మించిపోవడంతో స్నానం కూడా చేయకుండా ఒక సమావేశానికి పరుగెట్టానని, మన శక్తి, సామర్థ్యం, అవకాశాలు చెప్పి పెట్టుబడులు తేవాలని, టెక్నాలజీ నేర్చుకోవాలని, ప్రజలకు ఉపయోగపడాలని తాను ప్రయత్నాలు చేస్తుంటే వాళ్లు తప్పుడు మెయిల్స్ పంపి పరువు తీశారన్నారు.
డల్లాస్కి వెళ్లేసరికి ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి ఉన్నారని, వాళ్ల అధ్యక్షుడికి ప్రమాదం ఉందంటే అమెరికా పోలీసులు ఆయన మాట వినరని, ముందు తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో ఉంచుతారని, తాను వెళ్లేసరికి తనను కూడా పక్కకు లాగేస్తున్నారని, అక్కడి వాతావరణం చూసి షాకయ్యానని అన్నారు.
అక్కడి పరిస్థితి చూసి తాను షాకయ్యానని, ఏం జరిగిందని అడిగానని చంద్రబాబు చెప్పారు. మెయిల్ వచ్చిందని, హైకమిషన్ నుంచి సమాచారం రావడంతో భద్రత పెంచామని చెప్పారని పేర్కొన్నారు.
ట్రంప్ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారని..
మనం ట్రంప్ చర్యల గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నామని, తప్పుడు మెయిల్స్ లాంటి చర్యల వల్ల మన పరువు కూడా అక్కడ పోతుంది కదా అని మండిపడ్డారు.
నాకంటే ప్రజలు సీరియస్గా తీసుకోవాలి
తప్పుడు మెయిల్స్ పంపించడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా? అని విలేకరి ప్రశ్నించగా.. తాను ఒక రాష్ట్ర ప్రతినిధిగా విదేశాలకు వెళ్లానని, అక్కడ రాజకీయాలు మాట్లాడలేదని, మెయిల్స్ ఎవరు పంపించారన్నది దర్యాప్తు చేస్తున్నామని, తాను సీరియస్గా తీసుకోవడం కంటే ప్రజలే తీసుకోవాలని, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? రాష్ట్ర ప్రతిష్ఠ ఏమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మొదటిసారి నాకు అనుభవం.. జగన్ పార్టీ ఉండదు
తప్పుడు ఈ మెయిల్స్ పంపించడం చాలా దుర్మార్గమని, నేరపూరిత చర్య అన్నారు. తనకు మొదటిసారి ఇలాంటి అనుభవం ఎదురైందన్నారు. ప్రజలు అరవై మంది ఎమ్మెల్యేలను గెలిపించారు కాబట్టి వాళ్లు అలా చేస్తున్నారని, వచ్చే ఎన్నికల తర్వాత ఆ పార్టీ (వైసిపి) ఉంటుందన్న నమ్మకం లేదన్నారు. హోదాపై కూడా యూ టర్న్ తీసుకున్నారన్నారు. పార్టీ విధానాల కోసం సోషల్ మీడియాను వాడుకుంటే తప్పులేదని, కానీ హద్దులు దాటవద్దన్నారు.