సెట్టింగ్ అవసరం లేదు, కొందరి రాజకీయం: జగన్పై బాబు, పోలవరం వ్యయం రెట్టింపు
విశాఖ: ఏపీని హార్డ్ వేర్ తయారీ పరిశ్రమలకు కేంద్రంగా మలుస్తామని, ఈ రంగానికి చెందిన పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పిలుపునిచ్చారు.
చలన చిత్ర పరిశ్రమ కేంద్రంగా విశాఖపట్నాన్ని మలుస్తామని, హుధుద్పై గెలుపు విశాఖ వాసులదేనన్నారు. బాధలు, కష్టాల్ని ఆనందంగా భరించి మనోనిబ్బరంతో విజయం సాధించారన్నారు. రూ.2.220 కోట్లతో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామన్నారు.
కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి సోమవారం విశాఖపట్నంలో సీఎంచంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖపట్నం విమానాశ్రయ ఆవరణ సుందరీకరణ, చలనచిత్ర సాంస్కృతిక కేంద్ర పనులకు శంకుస్థాపన చేశారు.
జియోనీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన తొలి దేశీయ సెల్ఫోన్ జియోనీ-ఎఫ్103ను ఆవిష్కరించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల తొలి సమ్మేళనంలో పాల్గొన్నారు. హుధుద్ పెను తుపాను నగరంలో తీరం దాటి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆర్కెబీచ్లో ఏర్పాటైన పునరంకిత సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జియోనీ సెల్ఫోన్ ఎప్103 ఆవిష్కరణ
ఏపీలో తయారు చేసిన తొలి దేశీయ సెల్ ఫోన్ జియోనీ-ఎఫ్103ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా పిలుపును పురస్కరించుకుని మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
దేశంలో మరుగుదొడ్లు లేనివారైనా ఉన్నారేమో గానీ, సెల్ఫోన్ లేనివారు లేరని చంద్రబాబు చమత్కరించారు. వృత్తి నైపుణ్యంగల యువత, పరిశ్రమల స్థాపనకు అవసరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు.
చెన్నై, తిరుపతి, నెల్లూరు ప్రధాన రహదారులను అనుసంధానిస్తూ.. నెల్లూరులోని శ్రీసిటీకి ట్రై - ఇండస్ట్రియల్ టౌన్షిప్ను అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ అదనంగా మరో పది సెల్ఫోన్ తయారీ పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకొస్తున్నాయన్నారు.
సినిమాకు విశాఖలో సెట్లు వేయవల్సిన అవసరం లేదు
చలన చిత్ర పరిశ్రమకు విశాఖ ప్రధాన కేంద్రం కాబోతుందన్నారు. ఇక్కడ సెట్లు వేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన అందాలున్నాయన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతో సహకారాన్ని అందిస్తున్నా, కొందరు రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నారని జగన్ను ఉద్దేశించి అన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్య ఢిల్లీలో పెద్ద దిక్కుగా ఉంటూ, రాష్ట్రాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణతో ఎలాంటి వివాదం లేకుండా చక్కని నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందన్నారు. పర్యాటకంగా విశాఖపట్నం అంతర్జాతీయ గుర్తింపు సాధించే రోజు సమీపంలోనే ఉందని వెంకయ్య పేర్కొన్నారు.
నగరాన్ని హుధుద్ ముందటి కంటే భారీగా అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య చూపిన చొరవ మరువలేనివన్నారు. ఉత్తరాంధ్రను మొత్తం రూ.2220 కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
పోలవరం వ్యయం రెట్టింపు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం భారీగా పెరిగింది. 2010లోని గణాంకాల కన్నా దాదాపు రెండింతలు అయింది. గతంలోని రూ.16,010.45 కోట్ల నుంచి తాజాగా రూ.30,985.78 కోట్లకు చేరింది. అంటే అంచనా వ్యవయంలో 93.54 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఈ మేరకు సంబంధితఫైల్ ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం వద్దకు వచ్చింది.