బాబుకి విస్తరణ తలనొప్పి: రామసుబ్బారెడ్డి Vsఆది, బుజ్జగింపులూ..హెచ్చరికలూ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసరత్తులు మొదలు పెట్టారు. ఆదివారం 9.30గంటలకు నూతన మంత్రులు ప్రమాణం చేయాల్సి ఉండటంతో మంత్రులు, పార్టీ కీలక నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. అయితే, శనివారం రాత్రి వరకు మంత్రివర్గ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఆదినారాయణ రెడ్డికి వద్దే వద్దు: రామసుబ్బారెడ్డి
కాగా, ఆశావాహులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో సీఎం రమేష్, రామసుబ్బారెడ్డి భేటీ అయ్యారు. కడపకు చెందిన టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారన్న వార్తలు రావడంతో ఈ భేటీ జరగడం గమనార్హం. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వవద్దని రామసుబ్బారెడ్డి గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తాము తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది.
బుజ్జగింపు: తేల్చేసిన రామసుబ్బారెడ్డి
ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి రామసుబ్బారెడ్డిని బుజ్జగించాలని టీడీపీ అధిష్టానం భావించినట్లు సమాచారం. అయితే, రామసుబ్బారెడ్డి మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిసింది. అయితే, ఇదంతా మీడియా వార్తలు మాత్రమేనని తమతో అధిష్టానం ఎలాంటి చర్చలు జరపలేదని రామసుబ్బారెడ్డి అన్నారు. ఆర్టీసీ ఛైర్మన్ పదవిని గతంలోనే వద్దని చెప్పానని తెలిపారు.
ఆదినారాయణ రెడ్డి పార్టీలో చేరినప్పుడే తన వాదన వినిపించినట్లు చెప్పారు. ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే సమాచారం తమకు లేదని అన్నారు. మాకు ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చెప్పారని అన్నారు. తాము టీడీపీ కోసం తాము ఎంతో చేశామని అన్నారు. ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి వచ్చారని, తాము పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నట్టు గుర్తుచేశారు. పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లామన్నారు. తమ అభిప్రాయాన్ని చంద్రబాబు కోరితే జిల్లాలో ఉన్న పరిస్థితిని వివరిస్తామని అన్నారు.
తమను పరిగణలోకి తీసుకోండి: ఆశావాహులు
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో జిల్లాల వారీగా పలువురు ఆశావాహులు తమను పరిగణలోకి తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, కళా వెంకట్రావులు చంద్రబాబును కలిసి ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది.
చంద్రబాబును కలిసిన సందర్భంగా ధూళిపాళ్ల భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది. తాను ఎప్పుడూ పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరించలేదని అన్నట్లు తెలిసింది. పదేళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా పార్టీకి సేవలందించినట్లుగా బాబు దృష్టికి తెచ్చినట్లు సమాచారం.
ఆ మంత్రులకు ఉద్వాసన తప్పదా?
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో పలువురు పాత మంత్రులకు ఉద్వాసన పలికేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రులు పీతల సుజాత, మృణాళిని, కొల్లు రవీంద్ర, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిశోర్ బాబులు అధిష్టానంతో చర్చలు జరుపుతుండటం గమనార్హం. బొజ్జాల గోపాలకృష్ణా ఇప్పటికే రెండుసార్లు సీఎం చంద్రబాబును కలిసినట్లు సమాచారం. కాగా, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ కూడా చంద్రబాబుతో భేటీ అయినట్లు తెలిసింది.
తాజాగా ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు ఇప్పటికే మంత్రి పదవి ఖరారు కాగా, నక్కా ఆనంద్ బాబుకు మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముస్లిం మైనార్టీ వర్గానికి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు కొత్తవారికి అవకాశం లభించనున్నట్లు తెలిసింది.
ఇది ఇలా ఉండగా, విజయనగరం జిల్లాలో సుజయకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు రావడంతో జిల్లా టీడీపీ కీలక నేతలు మండిపడుతున్నట్లు తెలిసింది. దీంతో టీడీపీ అధిష్టానం వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆదినారాయణ రెడ్డికి మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తలతో కడప టీడీపీలో కూడా భారీగా విభేదాలు చోటు చేసుకున్నాయి.
ఆశావాహులు, అసంతృప్తులతో చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు సమాచారం. కాగా, ఆదివారం మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తిరుపతి నుంచి గవర్నర్ నర్సింహన్ విజయవాడకు రానున్నారు.