దసరా ఉత్సవాలకు చంద్రబాబును ఆహ్వానించిన దుర్గగుడి పండితులు
అమరావతి: విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసులో బుధవారం వ్యవసాయ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతుకి బహుళ జీవనోపాధి కార్యక్రమాలు రూపొందించాలని చంద్రబాబు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉన్న ఐదు జిల్లాల్లో రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. రైతు సాధికార సంస్థ ద్వారా సహాయనిధి ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
ఇక భూమిని కౌలకు ఇచ్చిన యజమానికి ఇబ్బంది లేకుండా కౌలు రైతులను ఆదుకునేలా చర్యలు ఉండాలని ఆ దిశగా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు రైతు కుటుంబాలకు గేదెలు, గొర్రెలు, కోడిపిల్లలు పంపిణీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మ ఆలయ ఆధికారులు, పండితులు బుధవారం సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా దసరా దేవీనవరాత్రుల ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు పండితులు అందజేశారు. దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా ఆయన్ని కోరారు.
ఏపీ ప్రభుత్వం తరుపున సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి ఉత్సవాలు కావడంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేవీనవరాత్రుల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది.