గెలుస్తామనుకోవడం వేరు! గెలవడం వేరు: చంద్రబాబు హితోపదేశం
అమరావతి: అతివిశ్వాసం వద్దని, గెలుస్తామనుకోవడం వేరు.. గెలవడం వేరని పార్టీ నేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలోనూ తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాలని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
దిశానిర్దేశం
కాకినాడ ఎన్నికలపై మంగళవారం పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మూడేళ్ల అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
Recommended Video
అనుకోవడం వేరు.. గెలవడం వేరు..
బీజేపీకి కేటాయించిన డివిజన్లలోనూ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. నేతలు అతివిశ్వాసంతో ఉండొద్దని, గెలుస్తామనుకోవడం వేరు.. గెలవడం వేరని స్పష్టం చేశారు.
అన్యాయం జరగొద్దు..
సామాజిక పరంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత శ్రేణులపైనే ఉందన్నారు.
గెలుపు కోసం..
అనంతరం మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారు. కాకినాడలోగెలపునకు అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటున్నట్లు చంద్రబాబుకు తెలిపారు. టీడీపీ గెలుపు కోసం స్థానిక, జిల్లా నేతలతో కలిసి రాష్ట్ర నేతలు విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు.