అమరావతిలో డ్రైవర్ రహిత వాహనాలు!, ప్రజెంటేషన్ వట్టి వృథా అన్న జగన్
అడ్మినిస్ట్రేషన్ సిటీ పరిధిలో డ్రైవర్ రహిత వాహనాలకు కూడా ప్రతిపాదన చేయడం విశేషం.
అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధి హర్ష్ థాపర్ శాసనసభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా పోస్టర్ డిజైన్ ద్వారా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేకతల గురించి వివరించారు. ఎంత విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నారు? ఎక్కడెక్కడ ఎలాంటి థీమ్ సిటీల నిర్మాణం జరగనుంది? వంటి అంశాలను సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేలకు వివరించారు.
కాగా, మొత్తం 900 ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ సిటీతో పాటు 9 థీమ్ సిటీలను రాజధానిలో నిర్మించనున్నారు. అడ్మినిస్ట్రేషన్ సిటీ పరిధిలో డ్రైవర్ రహిత వాహనాలకు కూడా ప్రతిపాదన చేయడం విశేషం. దీంతో రోడ్ల మధ్యలో గ్రీన్ లైన్ ను ప్రతిపాదించారు. విశాలమైన రోడ్ల వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో గ్రీన్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. గాలి వేగానికి అనుగుణంగా భవనాల నిర్మాణం జరపనున్నట్లు తెలిపారు.
ప్రజెంటేషన్ అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్బంగా రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రైతుల త్యాగాలతోనే నవ్యాంధ్ర రాజధాని సాధ్యమవుతోందన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒకవేళ రైతులు భూములు ఇచ్చి ఉండకపోతే.. భూముల కొనుగోళ్లకు రూ.40వేల కోట్ల భారం పడేదన్నారు.
రాజధానిలో మొత్తం 9థీమ్ సిటీలు, 27టౌన్ షిప్స్ ను నిర్మిస్తున్నామని అన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్ర రూపు రేఖలే మారిపోతాయని చంద్రబాబు అన్నారు.
అమరావతి ప్రజెంటేషన్ వృథా: జగన్
ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణం విషయంలో అధికార పార్టీ తీరును తప్పుపట్టారు. అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన రాజధాని నమూనా డిజైన్ల ప్రదర్శనకు ఆయన హాజరు కాలేదు.
దీనిపై కారణాలను మీడియాతో వివరించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇంతవరకు ఏపీ రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టలేదని అన్నారు. ఎవరిని మోసం చేయడానికి రాజధాని డిజైన్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్స్ ఇస్తున్నారని ప్రశ్నించారు. వీటివల్ల ఒరిగే ఉపయోగం ఏమి లేదని, సమయం వృథా అని అసంతృప్తి వ్యక్తం చేశారు.