బాబు మంత్రివర్గ విస్తరణ, ఎవరెవరికి బెర్తులు..?
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బాబు మంత్రివర్గంలో ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఒక్క మంత్రి కూడా లేకపోవడం విశేషం. ఈసారి మంత్రివర్గ విస్తరణలో వారికి ప్రాధాన్య ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
పోయిన సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు వర్గాలకు చెందిన వారెవరూ ఎమ్మెల్యేలుగా గెలుపొందలేదు. దీంతో ఏపీలో శాసనమండలి ఎన్నికల వేళ ఆ లోటుని బాబు భర్తీ చేశారు. వారినే మంత్రులుగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
వీరితో పాటు మరికొందరు సీనియర్లకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కనుందని ప్రచారం జరుగుతోంది. తాజా విస్తరణలో భాగంగా చంద్రబాబు తన మంత్రివర్గంలోకి ఆరుగురిని తీసుకునే వెసులుబాటు ఉంది. గురువారం ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన ఎంఏ షరీఫ్కు ఈ విస్తరణలో తప్పనిసరిగా ఓ బెర్తు దక్కనుంది.
ఇక మహిళా కోటాలో ఎస్టీ నేత సంధ్యారాణి పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటు పార్టీలో సీనియర్ నేతలైన కళా వెంకట్రావు, పతివాడ నారాయణ స్వామి నాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, గొల్లపల్లి సూర్యారావు, ధూళిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి, గాలి ముద్దు కృష్ణమనాయుడు పయ్యావుల కేశవ్ తదితరుల పేర్లని చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.