మీకు చేతకాకుంటే, నేనే అడవులకెళ్తా: ఊగిపోయిన బాబు, టిడిపికి రూ.1000కి లీజ్ స్థలం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం వైద్య, ఆరోగ్య, అటవీ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు చేతకాకుంటే నేనే అడవులకు వెళ్లి పని చేసుకుంటానని ఆయన మండిపడ్డారు.
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం వైద్య, ఆరోగ్య, అటవీ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు చేతకాకుంటే నేనే అడవులకు వెళ్లి పని చేసుకుంటానని ఆయన మండిపడ్డారు.
చదవండి: శిల్పాకు వైసిపి కాటసాని షాక్, జగన్ హామీపై ట్విస్ట్
గురువారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూడు శాఖల తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజలు రోగాల బారిన పడుతున్నా చేస్తాం.. చూస్తామని చెబుతున్నారని, ఇదేమిటని సంబంధిత అధికారి పూనం మాలకొండయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు చేతకాకుంటే నేనే అడవులకు వెళ్లి పని చేసుకుంటానని చెప్పారు.
అటవీ శాఖ అధికారులతో..
ప్లాంటేషన్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారని అటవీ శాఖ అధికారులను చంద్రబాబు అఅడిగారు. వచ్చే నెల రెండో వారంలో ప్రారంభిస్తామని వారు చెప్పారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు పడే రోజుల్లో కాకుండా మీకు ఇష్టం వచ్చినప్పుడు పెడితే ఎలాగని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆత్మకూరులో టిడిపికి కార్యాలయం.. 99 ఏళ్లకు లీజ్
మంగళగిరి మండలం ఆత్మకూరులో ఏపీ టిడిపి కార్యాలయానికి స్థలం కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. 3.65 ఎకరాలను 99 ఏళ్ల పాటు ఏడాదికి రూ.1000 చొప్పున లీజుకు ఇవ్వనున్నారు.
విశాఖ భూకుంభకోణంపై..
విశాఖ భూకుంభకోణం వ్యవహారంలో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్ల తీరుతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. భూ కుంభకోణం వ్యవహారమై విచారణ నిమిత్తం సిట్ వేసిన తర్వాత కూడా ఈ అంశంపై మాట్లాడటం సరికాదని అన్నారు.
కేబినెట్ నిర్ణయాలు
ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగింది. ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు మంత్రివర్గం తీసుకుంది. పరిపాలన, వివిధ అంశాల్లో సింగపూర్తో అవగాహన ఒప్పంద కాలాన్ని పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కాల వ్యవధి, 2018 చివరి నాటికి ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, సోషల్ మీడియాలో ఉద్యోగుల నియామకానికి, వారికి వేతనాలు పెంచడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 21 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించి, అయిదేళ్ల వరకు నిర్వహణ కోసం పీపీపీ పద్ధతిలో టెండర్లు, రాష్ట్రంలో 759 బార్ల లైసెన్సులు రెన్యువల్ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.