అయ్యప్ప దీక్షలా నీరు-చెట్టు కార్యక్రమం: బాబు
హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో శనివారం పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మునగనూరు మండలం పోలవరం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష తరహాలోనే తాను జల దీక్ష తీసుకున్నానని, రాష్ట్రంలోని ప్రజలకు సాగు, తాగు నీరు అందించేవరకు జలదీక్ష విరమించను అని చెప్పారు. ఏపీలో డ్వాక్రా రుణాలను దశలవారీగా మాఫీ చేస్తామని అన్నారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను పూర్తి చేసి, తానే ప్రారంభిస్తానని చెప్పారు.
గతేడాది వర్షపాతం తక్కువగా నమోదు అవడం వల్ల ప్రకాశంలో కరువు పరిస్థితి ఏర్పడిందని, భూగర్బ జలాలు ఇంకిపోయాయని అన్నారు. గ్రామాల్లో నీటిసమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవాలని అవసరం ఉందని చెప్పారు.
ఇక కాంగ్రెస్ హయాంలో ఒక్క ఎకరాకూ కూడా నీరు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో దగా పాలన సాగిందని దొరికినంత దోచుకున్నారని ఆరోపణలు చేశారు. ఒక పద్ధతి పాడు లేకుండా రాష్ర్టాన్ని విభజించారని బాబు ధ్వజమెత్తారు. కనీసం ఆంధ్రప్రదేశ్కు రాజధానిని కూడా ప్రకటించకుండా విభజించారని అన్నారు.
రాబోయే నాలుగైదేళ్లలో ఏపి నుంచి కరువుని తరిమేస్తామని, ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. త్వరలో దొనకొండ ఇండస్ర్టియల్ కారిడార్ అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. రాయంపేట పోర్టు వచ్చే అవకాశం ఉందన్న చంద్రబాబు చీమకుర్తిలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పొలం పిలుస్తుంది ద్వారా ఆధునికమైన వ్యవసాయ పద్దతులు పెట్టి, ఉత్పాదక శక్తిని పెంచనున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో నదుల అనుసంధానంలో భాగమే పట్టిసీమ ప్రాజెక్టు అని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిందని అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు. దీంతో ప్రకాశం జిల్లాలో ఆయన పర్యటన ముగిసింది.
దీంతో హెలికాప్టర్లో నెల్లూరు జిల్లాకు బయల్దేరి వెళ్లారు. జిల్లాలోని తూపిటిపాలెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ)కి ఈరోజు ఆయన శంకుస్ధాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి కూడా పాల్గొనున్నారు.