ఎమ్మెల్యే ఆరిమిల్లిపై కేసు: రంగంలోకి బాబు, వివాదం ముదరకముందే చక్కదిద్దేలా!
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణపై పోలీస్ కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐ సహా ఓ రైటర్ను నిర్బంధించిన కేసులో ఆయనపై కేసు నమోదైంది. అంతకుముందు టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా.. తమ పార్టీ కార్యకర్తలపై కేసు పెట్టడాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి తీవ్రంగా పరిగణించారు.
ఆపై ఎస్ఐని, రైటర్ను ఇంటికి పిలిపించి నిర్బంధించారు. దీంతో పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో ఆయనపై కేసు నమోదైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసు నమోదవడం పట్ల జిల్లాలోని మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా అసహనంతో ఉన్నారు. దీంతో అధినేత చంద్రబాబు స్వయంగా కల్పించుకునేదాకా వెళ్లింది పరిస్థితి.
జిల్లాకు చెందిన 8మంది ఎమ్మెల్యేలటో భేటీ అయ్యేందుకు ఆయన సన్నద్దమయ్యారు. ఈ మేరకు ఆయా ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు వారితో భేటీ అవనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఎమ్మెల్యే ఆరిమిల్లిపై కేసు కొనసాగుతుందన్నారు హోంమంత్రి నిమ్మల చినరాజప్ప. వివాదాన్ని చక్కదిద్దడంలో విఫలమైనందుకే సీఐ రామారావుపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో 300పొలిటికల్ మర్డర్స్ జరిగాయని జగన్ చేసిన ఆరోపణలను చినరాజప్ప ఖండించారు.
వైఎస్ హయాంలోనే రాజకీయ హత్యలు ఎక్కువగా జరిగాయన్న సంగతిని చినరాజప్ప గుర్తుచేశారు. కర్నూల్, అద్దంకి హత్యల్లో ఫ్యాక్షన్ గొడవలే కారణమని, ఫ్యాక్షనిజాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. విశాఖలో జరిగే మహానాడు కోసం 3వేల మందితో పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.