ఖబడ్దార్!: సీఎం హెచ్చరిక, హామీ గుర్తుందా.. బాబుకు అనంత ఝలక్
అమెరికాకు కూడా ఏపీ నుంచే పండ్లు వెళ్లాలని, రోజు వస్తుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అనంతలో ఏరువాక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అనంతపురం: అమెరికాకు కూడా ఏపీ నుంచే పండ్లు వెళ్లాలని, ఆ రోజు వస్తుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలోని ఏరువాక కార్యక్రమంలో అన్నారు.
అధికారులు కమీషన్లు తీసుకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. దళారి వ్యవస్త లేకుండా చేయాలని చెప్పారు. రైతులను దోచుకుంటే ఊరుకునేది లేదన్నారు.
హోదాపై పోరులో వెనక్కి: చిక్కుల్లో జగన్, అసలేం జరిగింది?
అనంతపురం జిల్లాను కరవురహిత జిల్లాగానే కాకుండా నెంబర్ వన్ జిల్లాగా కూడా చేస్తామని చెప్పారు. అనంతపురం ఉద్యానవన పంటలకు కేంద్రంగా మారనుందన్నారు.
రైతులకు నష్టం వచ్చే విధంగా వ్యవహరించేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సూట్ పేరిట ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుంటే చర్యలు తప్పవన్నారు.
గంగా-గోదావరిల అనుసంధానం
రాయలసీమను రతనాల సీమగా మార్చుతామన్నారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానిస్తామని చెప్పారు. రైతును గౌరవించాలని, ఆదరించాలని, రైతుకు ఇబ్బందులు లేకుండా చేయాలని, అప్పుడే రాష్ట్రం, దేశం బాగుపడతాయన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తనదే అన్నారు. భవిష్యత్తులో గోదావరి - కృష్ణా నదులు కలవాలన్నారు. కొత్త టెక్నాలజీతో పిడుగుపాడుకు ఎవరూ మృతి చెందకుండా చేస్తామన్నారు.
చంద్రబాబూ! ఈ హామీ గుర్తుందా?
అనంతపురం వాసుల నీటి కష్టాలను తీర్చేలా గత ఏడాది చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదని రాయదుర్గం ప్రాంత వాసులు అసంతృప్తితో ఉన్నారు. బైరవానితిప్ప ప్రాజెక్టు (బిటిపి) పనులు పూర్తి చేయడానికి చంద్రబాబు ప్రకటించిన గడువు మరో రెండు నెలల్లో ముగియనుంది. కానీ ఇప్పటి దాకా పనులే ప్రారంభం కాలేదు.
అమలు ఎప్పుడు?
ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ అది ఎప్పటికి అమలవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 30, 2016 అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం గుమ్మఘట్టలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
హామీ ఇచ్చిన చంద్రబాబు
భైరవానితిప్ప ప్రాజెక్టు (బిటిపి)ను ఏడాదిలోగా పూర్తి చేసి నీరిస్తామని హామీ ఇచ్చారు. ఆపై ప్రాజెక్టుకు రూ. 1300 కోట్లు అవుతుందని తొలుత, ఆ మొత్తం ఎక్కువన్న ఉద్దేశంతో రూ. 1100 కోట్లతోనే పూర్తి చేయవచ్చని అధికారులు నివేదికలు ఇచ్చారు.
ఒక్క పనీ మొదలు కాలేదు
ఆపై మరో రిపోర్టు ఇస్తూ..ప్రాజెక్టును రూ. 800 కోట్లతోనే పూర్తి చేయవచ్చన్నారు. చంద్రబాబు హామీ ఇచ్చి 10 నెలలు గడుస్తోంది. ఆయన చెప్పిన ఏడాది వ్యవధి మరో రెండు నెలల్లో పూర్తి కానుండగా ఇప్పటి వరకూ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక్క పనీ మొదలు కాలేదు.
రైతులకు నిరాశే
ఈ సంవత్సరం తమ పొలాలకు నీరందుతుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించిన ఫైలు ఈ పది నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
దీనిపై చంద్రబాబు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతుల డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబుపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, తమ సమస్యలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరిస్తారని ఎదురు చూస్తున్నామని రైతులు అంటున్నారు.