ఇకవద్దు: సొంత పార్టీ నేతలకు బాబు గట్టి వార్నింగ్, రేవంత్ హడావుడి.. ఏపీ నేతల ఆశ్చర్యం
భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించి ఎవరు కూడా వ్యతిరేక వ్యాఖ్యలు, బహిరంగ విమర్శలు చేయవద్దని, చేస్తే మాత్రం తీవ్రంగా పరిగణిస్తానని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
విశాఖ: భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించి ఎవరు కూడా వ్యతిరేక వ్యాఖ్యలు, బహిరంగ విమర్శలు చేయవద్దని, చేస్తే మాత్రం తీవ్రంగా పరిగణిస్తానని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు వేదికగా హెచ్చరిక జారీ చేశారు.
ఇటీవల పొత్తులపై టిడిపి ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్లు బిజెపికి ఆగ్రహం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఇవి దుమారం రేపాయి. అమిత్ షా - చంద్రబాబు భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. విమర్శలపై తమ నేతలను అదుపులో ఉంచుతానని బాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు నోరు జారొద్దని మహానాడులో చెప్పారు.
చదవండి: జగన్ వద్దు: కన్విన్స్ చేసేందుకు బాబు, ఏపీపై షా సర్వేలో ఏం తేలిందంటే..
జాతీయ రాజకీయాలు-తెలుగుదేశం పార్టీ అన్న అంశంపై టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత తోట నర్సింహం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఈ తీర్మానాన్ని పార్టీ తెలంగాణ నాయకులు వేం నరేంద్రరెడ్డి, తుళ్లూరు బ్రహ్మయ్య బలపరిచారు.
భాగస్వామిగా ఉన్నాం
జాతీయ రాజకీయాల్లో టిడిపి తొలి నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తోందని, రాష్ట్ర, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇతర రాజకీయ పార్టీలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నామని చంద్రబాబు అన్నారు.
అందుకే పొత్తులు
ప్రధాని నరేంద్ర మోడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, వాటిలో మనమూ భాగస్వాములవుతున్నామని, పార్టీ, దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పొత్తులు కుదుర్చుకుంటుందని, పొత్తులపై విమర్శలు చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు.
ఎన్టీఆర్ హయాంలోనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై పోరు సాగించేందుకు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారని, నాలుగు కాంగ్రేసేతర ప్రభుత్వాల ఏర్పాటులో టిడిపి కీలక పాత్ర పోషించిందని చంద్రబాబు అన్నారు.
కేంద్రానికి అప్పీల్
దక్షిణాదిన వెనుకబడిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీ అని, తలసరి ఆదాయంలో అన్ని దక్షిణాది రాష్ట్రాల కంటే వెనుక ఉన్నామని, రాజధాని నిర్మాణానికి కేంద్రం కొంత సహాయం చేసిందని చంద్రబాబు అన్నారు. రూ.2,500 కోట్లు ఇచ్చిందని, దక్షిణ భారతంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎదిగేంత వరకు ఏపీకి చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు.
చక్రం తిప్పుతున్నాం.. తోట, బిజెపి అప్పుడు రెండే గెలిచింది.. వేం
జాతీయ స్థాయిలో టిడిపి చక్రం తిప్పుతోందని తోట నర్సింహం అన్నారు. ఎర్రన్నాయుడు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండేవారని, ఇప్పుడు తనకు అవకాశం దక్కడం గొప్ప విషయమన్నారు.
1984లో జరిగిన ఎన్నికల్లో టిడిపి 35 లోకసభ స్థానాలను కైవసం చేసుకుంటే బిజెపి అప్పట్లో కేవలం రెండే స్థానాలకు పరిమితమైందని, ఆ రెండింటిలో ఒకటి టిడిపి పొత్తుతో రాష్ట్రంలో గెలిచిన స్థానమని వేం నరేందర్ రెడ్డి అన్నారు.
తెలంగాణపై చంద్రబాబు
తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సండ్ర వెంకట వీరయ్య తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనిపై చంద్రబాబు మాట్లాడారు. పార్టీ, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల వెంటే ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతున్న నాయకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, పార్టీ అధ్యక్షునిగా పూర్తి మద్దతు ఇస్తానన్నారు. పదమూడేళ్లు విపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై మొక్కవోని దీక్షతో పోరాడుతున్నారన్నారు.
మరోవైపు, మహానాడులో రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహానాడులో రేవంత్ వేదిక పైకి రాగానే కార్యకర్తలు, నేతలు ఈలలు, కేకలతో హర్షధ్వానాలు చేశారు. వేదికపై ఆయన పేరు ప్రస్తావించిన ప్రతిసారి చప్పట్లు మార్మోగాయి. అది ఏపీ నేతలను సైతం ఆశ్చర్యపరిచిందట. రేవంత్తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. మంత్రి నారా లోకేష్ ఆయనతో 15 నిమిషాలు మాట్లాడారు.
చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల సమయంలో కార్యకర్తలు చుట్టూ తిరిగి గెలిచిన తర్వాత వాళ్లను పట్టించుకోకుండా వదిలేస్తున్న నాయకులు కొందరు పార్టీలో ఉన్నారంటూ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు ఎన్నికలకి ముందు ఎలా ఉంటారో ఎమ్మెల్యేలయ్యాక కూడా కార్యకర్తలతో అలానే ఉండాలన్నారు.
పని చేయని, గాడితప్పిన నేతల్ని ఎన్నికల నాటికి చంద్రబాబు కట్ చేస్తారని చినరాజప్ప అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు - సంస్థాగత నిర్మాణం - కార్యకర్తల సాధికారతపై తీర్మానాన్ని మహానాడులో ప్రవేశపెడుతూ చినరాజప్ప ప్రసంగించారు. పదవులు వచ్చాక ఇంకా పెద్ద పదవి కావాలనే రీతిలో వ్యవహరించడం సరికాదని, పదవులు కాదు, పార్టీ ముఖ్యమనే ఆలోచన అందరూ చేయాలని, కార్యకర్తల్ని గౌరవిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది టిడిపియే అన్నారు.
ఆయనే చూసుకుంటారు
పార్టీ అధినేత చంద్రబాబుపై పూర్తి విశ్వాసం ఉంచితే, అన్నీ ఆయనే చూసుకుంటారని, ఎన్నికల్లో చంద్రబాబు ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపించుకొందామన్నారు. ఈ తీర్మానాన్ని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఇ పెద్దిరెడ్డి బలపరుస్తూ తమ పార్టీ ఆన్లైన్ ద్వారా పక్కాగా సభ్యత్వాన్ని నమోదు చేసిందనీ, ఎవరైనా చూసుకోవచ్చన్నారు.