చంద్రబాబు వార్నింగ్: విభేదాలు పక్కనబెట్టకపోతే పదవులుండవ్..
నేతల పనితీరుకు సంబంధించి తన వద్ద నివేదికలు ఉన్నాయని, వాటి ఆధారంగా పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
విజయవాడ: అంతర్గత విభేదాలతో పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారన్న కారణంతో విజయనగరం టీడీపీ నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మందలించారు. శనివారం నాడు విజయనగరం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులతో ఆయన భేటీ అయ్యారు.
విభేదాలు పక్కనబెట్టి పనిచేయకపోతే పదవుల నుంచి తొలగిస్తానంటూ ఈ సందర్బంగా చంద్రబాబు వారిని హెచ్చరించారు. అందరి జాతకాలు తనవద్ద ఉన్నాయని, విభేదాలతో పార్టీని నాశనం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఆయా పత్రికల్లో విజయనగరం టీడీపీ విభేదాలపై వచ్చిన కథనాలను ఈ సందర్బంగా చంద్రబాబు వారి ముందు పెట్టారు.
వీటికి ఏం సమాధానం చెబుతారంటూ విజయనగరం టీడీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ తీరును తప్పుపట్టారు. సాలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండగా ఎమ్మెల్సీ జోక్యం ఏంటని నిలదీశారు. జిల్లా నేతలంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
నేతల పనితీరుకు సంబంధించి తన వద్ద నివేదికలు ఉన్నాయని, వాటి ఆధారంగా పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, నారాయణస్వామి నాయుడు, మీసాల గీత, చిరంజీవులు పాల్గొన్నారు.