ఆ ఓట్లపైనే టిడిపి, వైసీపీ దృష్టి, జగన్ రోడ్షోల వెనుక ప్లాన్ ఇదే!
నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో గెలుపు ఓటములపై ప్రభావం చూపే ఓట్లపై టిడిపి, వైసీపీలు కేంద్రీకరించాయి. ఆయా వర్గాలను ఆకట్టుకొనేందుకుగాను ప్రధాన పార్టీలు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాయి. గెలుపు కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.ఈ నెల 19వ,తేది నుండి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నంద్యాలలో 2 రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు.
ఈ నెల 23వ, తేదిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టిడిపి, వైసీపీలు శక్తవంచన లేకుండా ప్రయత్నాలను చేస్తున్నాయి.
గంగుల ఎఫెక్ట్: గోస్పాడు ఏకపక్షమేనా, తమ్ముడిని కాదని, వైసీపీకి దెబ్బేనా?
రాష్ట్రంలో ఏ ఇద్దరు కలసినా.. ఏ ఇద్దరు రాజకీయ నాయ కులు ఎదురుపడినా వారి మధ్య చర్చ ఒకటే. అదే నంద్యాల ఉప ఎన్నికలో విజయం ఎవరిది? రాబోయే సాధారణ ఎన్నికల్లో ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ సాగుతోంది.
చిరంజీవి బాటలోనే పవన్, ఆ భయంతోనే నంద్యాలలో తటస్థ వైఖరి!
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికను 2019 అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావిస్తున్నారు. దీంతో టిడిపి, వైసీపీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. రెండు పార్టీలకు చెందిన నేతలు నంద్యాలోనే మోహరించి పనిచేస్తున్నారు.
ఆ ఓటర్లపైనే టిడిపి, వైసీపీల దృష్టి
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 2.19 లక్షల ఓటర్లున్నారు. అయితే ఈ స్థానంలో గెలుపు, ఓటములపై కొన్ని సామాజిక వర్గాలు కీలకమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని గతంలో ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. దీంతో ఆయా సామాజికవర్గాలపైనే టిడిపి, వైసీపీలు కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. నంద్యాల పట్టణంలోనే 1.35 లక్షల మంది ఉన్నారు. ప్రధాన సామాజిక వర్గాలు ముస్లిం ఓటర్లు 45-50 వేలు, బలిజ ఓటర్లు 35-40 వేలు, ఆర్యవైశ్యుల ఓటర్లు 25 వేలు, క్రిస్టియన్లు , ఎస్సి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 30 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. ఈ సామాజిక వర్గాలు గెలుపు ఓటములపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. దీంతో ఇరుపార్టీలు ఆయా సామాజికవర్గాలను ఆకట్టుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
Recommended Video
అమరావతి నుండి బాబు వ్యూహలు
నంద్యాల ఉపఎన్నికపై చంద్రబాబునాయుడు అమరావతి నుండి వ్యూహలను అమలుచేస్తున్నారు. ప్రతిరోజూ మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బాబు వ్యూహాలతో పట్టణ ఓటర్లు టీడీపీకి సానుకూలంగా మారుతున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి రాకతో ఆ పార్టీకి గోస్పాడు మండలంలో బలం మరింత పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరడం వైసీపీకి ఇబ్బందికరమైన పరిణామంగా భావిస్తున్నారు విశ్లేషకులు.
నంద్యాలలోనే జగన్ మకాం
వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డిని గెలిపించుకొనేందుకుగాను వైసీపీ చీఫ్ జగన్ నంద్యాలలోనే మకాం వేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) సూచనలతోనే
జగన్ సుదీర్ఘంగా నంద్యాలలో ప్రచారం నిర్వహిస్తున్నారని వైసీపీ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి. జగన్ రోడ్షోలు ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పట్టణంలోని ఓటర్లను తనవైపుకు తిప్పుకొనేందుకు జగన్ ప్రతిరోజూ నిర్వహించే రోడ్షోలు కలిసివచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు వైసీపీ నేతలు.
నంద్యాలలో బాబు ప్రచారం
ఈ నెల 19వ, తేది నుండి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నంద్యాలలో రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. నంద్యాల ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నాలను ఆయన చేసే అవకాశాలున్నాయి. గత ఎన్నికల సమయంలో భూమా నాగిరెడ్డి ఇచ్చిన హమీలను అమలుచేసేందుకుగాను ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే పనుల శ్రీకారానికి పూనుకొన్నారు చంద్రబాబు. ఈ పనులకు శంకుస్థాపనలు చేయడం ఈ ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం కల్గించే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఈ నెల 19న, బాబు ప్రచారం కోసం నంద్యాలకు వచ్చిన సమయంలో పార్టీ నేతలకు ఎన్నికలపై దిశా నిర్ధేశం చేయనున్నారు.
ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్న భూమా కుటుంబసభ్యులు
భూమా కుటుంబసభ్యులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అఖిలప్రియ, బ్రహ్మనందరెడ్డి, భూమా మౌనిక నంద్యాల నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరుగుతూ తమకే ఒటు చేయాలని కోరుతున్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి మాత్రం జగన్ రోడ్షోలతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించడం లేదు.