ఇంకొక పంచ్! పవన్కు తగ్గని బాబు: ఇరకాటమే, మోడీకి హెచ్చరికే
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని కోసం రైతుల భూమిని బలవంతంగా లాక్కుంటే సహించేది లేదని, ఇక నుండి రైతుల సమస్య తనదిగా భావించి పోరాడుతానని హామీ ఇచ్చారు. అయితే, పవన్ స్పందించాల్సిన మరో అంశం కూడా ఉందని అంటున్నారు. అదే ఏపీకి ప్రత్యేక హోదా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో.. ఏపీ ప్రభుత్వం విషయంలో రాజధాని, కేంద్రం విషయంలో ప్రత్యేక హోదా, ప్యాకేజీ తదితర అంశాలు ప్రధానంగా ఉన్నాయి. రాజధాని విషయంలో స్పందించిన పవన్.. అదే రీతిలో ప్రత్యేక హోదా విషయంలోను స్పందించాలని కోరుకుంటున్నారు.
అయితే, ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రోడ్డెక్కుతానని పవన్ చెప్పడం గమనార్హం. రాజధాని విషయంలో బాబుకు హెచ్చరించిన పవన్.. హామీలు నెరవేర్చకుంటే అది ప్రధాని మోడీకి కూడా వర్తిస్తుందని చెప్పకనే చెప్పారంటున్నారు. టీడీపీ ప్రభుత్వం పైన పవన్ ఆవేశంగానే మాట్లాడారు.
బాబుకు ఎన్నో ప్రశ్నలు
రాజధాని ప్రాంతంలోని నాలుగు గ్రామాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధానికి 33వేల ఎకరాల భూమి అవసరమా, పదిహేను వేల ఎకరాలు కూడా ఎక్కువేనని హితవు పలికారు. రైతుల కన్నీటితో వచ్చే రాజధాని వద్దని చెప్పారు. రైతులు సంతోషంగా భూమి ఇస్తే తీసుకోవాలని, బలవంతంగా తీసుకుంటే మాత్రం తాను వారి తరఫున పోరాడుతానని బాబుకు హెచ్చరికలు జారీ చేశారు.
మద్దతు నుండి ఆమరణ నిరాహార దీక్ష దాకా.. షాక్
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికిన పవన్.. తాను ఎందుకు మద్దతు పలికానో కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం ఈ పర్యటనలో చేశారు. అదే ప్రజలకు అనుకూలంగా పని చేయకుంటే నిలదీసేందుకు వెనుకాడనని, అందుకే వచ్చానని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల్లో మద్దతిచ్చిన పవన్.. ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం పైన విరుచుకు పడటంతో పాటు.. రైతులకు న్యాయం జరగకుంటే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని చెప్పడం గమనార్హం. అప్పుడు టీడీపీకి మద్దతు పలికినా, ఇప్పుడు హఠాత్తుగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని చెప్పినా అది పవన్కే చెల్లిందని అంటున్నారు.
బాబుతో పాటు జగన్నూ ఏకేశారు
పవన్ తన పర్యటనలో ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా నిప్పులు చెరిగారు. పవన్ ఇలాగే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, అధికార పార్టీని నిలదీస్తే.. పార్టీ ఇప్పటి వరకు పోటీ చేయకపోయినప్పటికీ జగన్ కంటే టీడీపీకీ జనసేన ప్రత్యామ్నాయం కావొచ్చని అంటున్నారు.
జగన్ను కార్నర్ చేసినట్లే.. వ్యూహాత్మకమా?
పవన్ కళ్యాణ్ లైమ్ లైన్లోకి రావడం ద్వారా జగన్ను కార్నర్ చేసినట్లే అయిందని అంటున్నారు. వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారని భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కనిపిస్తోందని చాలామంది భావిస్తున్నారు. పవన్ వర్సెస్ చంద్రబాబు వల్ల జగన్ కార్నర్ అయ్యారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పవన్ పర్యటన ద్వారా చంద్రబాబు ఇరకాటంలో పడిపోయారు. అయితే, రాజధాని విషయంలో ప్రభుత్వం మాత్రం తగ్గేందుకు సిద్ధంగా కనిపించడం లేదు.
ఉద్యమస్థాయికి తీసుకెళ్లారు
రాజధాని ప్రాంత రైతుల సమస్యను పవన్ కళ్యాణ్ ఉద్యస్థాయికి మార్చారని అంటున్నారు. నిన్నటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మాట్లాడాయని, ఇప్పుడు పవన్ ద్వారా రైతుల ఆందోళన మరింత వెలుగులోకి వచ్చిందని, దానిని ఉద్యమస్థాయికి తీసుకు వెళ్లారని అంటున్నారు. పవన్ మద్దతు ఇలాగే రైతులకు ఉంటే అది ఏ పరిస్థితికైనా దారితీయవచ్చునని అంటున్నారు.
పవన్ హెచ్చరిక... తగ్గని ప్రభుత్వం, కౌంటర్లు
రాజధాని ప్రాంతంలో రెండు రోజుల క్రితం జగన్ పర్యటించారు. రైతులు ఇవ్వకుండా భూమి తీసుకోవడం సరికాదని హెచ్చరించారు. గురువారం నాడు పవన్ కళ్యాణ్ కూడా రాజధాని ప్రాంతంలోని నాలుగు గ్రామాల్లో (ఉండవల్లి, ఎర్రబాలెం, బేతపూడి, తుళ్లూరు) పర్యటించారు. రైతులు సంతోషంగా ఇస్తేనే భూమి తీసుకోవాలని, వారి ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
పవన్ పర్యటన పైన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ తదితరులు స్పందించారు. చంద్రబాబు అయితే కౌంటర్ ఇచ్చారు. రాజకీయ పార్టీలకు దూరదృష్టి ఉండాలని, రాజధాని అంటే కార్యాలయం కాదని విమర్శించారు. రాజధాని అంటే వెయ్యి ఎకరాల్లో కట్టవచ్చూ, ఐదు వేలు ఎకరాల్లో కట్టవచ్చునని చంద్రబాబు అన్నారు. ఆ విధంగా రాజధాని నిర్మిస్తే ఆ భూమికి విలువ రాదని ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని విమర్శించారు.
మంత్రి నారాయణ కూడా స్పందించారు. రాజధాని కోసం రైతులు స్వయంగా భూములు ఇచ్చారని, అయినా సమీకరణ పూర్తయిందని చెప్పారు. జగన్ పేరును చెబుతూ... రాజధాని కోసం భూసమీకరణ అయ్యాక వస్తే లాభమేమిటని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్య పవన్కు కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి జగన్, పవన్.. ఎవరు వచ్చినా రాజధాని విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేసేలా కనిపించడం లేదని అంటున్నారు.