రాత్రింబవళ్లు కష్టపడినా వాళ్లతో పోటీపడలేం: బాబు
కర్నూలు: 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మిగులు బడ్జెట్ ఉంటే ఏపి మాత్రం భారీ రెవెన్యూ లోటుతో ఉందని అన్నారు. కేంద్రాన్ని సాయం కోసం గట్టిగా అడుతామని చెప్పారు. ఐదేళ్లు రాత్రింబవళ్లు కష్టపడినా వాళ్లతో పోటీ పడలేమని చంద్రబాబు అన్నారు.
కర్నూలు జిల్లాలో శుక్రవారం పర్యటించిన చంద్రబాబునాయుడు సోషల్ ఎంపవర్మెంట్ మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము కోరుకున్న విధంగా విభజన జరగలేదని అన్నారు. ఏపి ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండానే రాష్ట్రాన్ని విభజించిందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.
కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలని చంద్రబాబు అన్నారు. ఏపికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. 5ఏళ్ల తర్వాత కూడా ఆదాయం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే.. అది ఏపినేనని ఆర్థిక సంఘం కూడా తెలిపిందని చంద్రబాబు చెప్పారు. జమ్మూకాశ్మీర్ తప్ప ఏపి వెనక అభివృద్ధి చెందని రాష్ట్రాలేవి ఉండవని అన్నారు.
రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా తాను భయపడబోనని, సంక్షోభంలో కూడా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తానని చంద్రబాబు అన్నారు. ఆర్థికంగా వెనకబడిన హైదరాబాద్ను తానే అభివృద్ధిలోకి తీసుకొచ్చానని చెప్పారు. పేదరికం పోవాలంటే, అభివృద్ధి జరంగాలంటే ప్రజలందరూ కలిసి రావాలని అన్నారు. అనుకున్నది సాధించే నిద్రపోవద్దని చంద్రబాబు అన్నారు.
కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. రూ. 500 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల కోసం మంజూరు చేశామని అన్నారు. రూ. 10వేల చొప్పున డ్వాక్రా మహిళలకు అందిస్తున్నామని చెప్పారు. డ్వాక్రా సంఘాలను ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
గ్రామాల్లో వ్యాపార అవకాశాలను పెంచుతామని చెప్పారు. వృద్ధులు ఇబ్బందులు పడకుండా ఇంటి వద్దనే పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులో ఆలయాలున్నాయని, మెగా టూరిజం సర్క్యూట్గా కర్నూలును తీర్చిదిద్దుతామని చెప్పారు. భారతదేశం మొత్తం కర్నూలుకు వచ్చే విధంగా చేస్తామని చంద్రబాబు తెలిపారు.