అసహనం: బాబుతో ఢిల్లీకి పవన్, ప్రశ్నలతో వెంకయ్య ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్లు త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు.. తదితర విషయాలలో ఏపీకి తీవ్ర అసంతృప్తి కలిగించింది. పవన్ ఇటీవలే ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేక హోదా పైన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం చంద్రబాబు ఇంటికి వెళ్లి పవన్ కలిశారు. ఇరువురు నేతలు దాదాపు గంటన్నర పాటు చర్చించారు.
వీరిద్దరు త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశాలపై చర్చించారని సమాచారం. ఢిల్లీకి వెళ్లి కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టేలా ప్రయత్నాలు చేయాలని వారు చర్చించారు. మరోవైపు, రాజధాని కోసం జరుగుతున్న భూసమీకణ పైన కూడా చర్చించారని సమాచారం. ప్రభుత్వం రైతుల భూమిని బలవంతంగా లాక్కుంటోందని జనసేన పార్టీ జెండాలతో ఇటీవల రైతులు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.
చంద్రబాబుతో భేటీలో పవన్ కేంద్రం తీరు పైన అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. గతంలో వలె కేంద్రమంత్రులను కలిసి రావడం కాకుండా... స్థానిక పరిస్థితులను, ఏపీకి ఉన్న కష్టనష్టాలను వారికి పూర్తిగా వివరించాలని వారు నిర్ణయించారని సమాచారం. ప్రధాని మోడీని కలిసి ఏపీ సమస్యలను వివరించాలని చర్చించారని తెలుస్తోంది.
ప్రశ్నలతో సమాధానం చెప్పలేక వెంకయ్య సతమతం
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో విలేకరులు సంధించిన ప్రశ్నలతో వెంకయ్య నాయుడు సతమతమయ్యారు. హైదరాబాదులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్లు కేటాయించడం, విభజన హామీల పైన ప్రశ్నల వర్షం కురిపించారు.
సమాధానం చెప్పేందుకు వెంకయ్య ఇబ్బంది పడ్డారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోలేదని, పోలవరం ప్రాజెక్టుకు మరిన్ని నిధులు కేటాయించాని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీని కోరుతామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో అన్నాయం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు.