ఇదీ మీ రిపోర్ట్: నేతల రిపోర్ట్ చదివిన బాబు, గంటాపై అసంతృప్తి, జగన్ వల్గర్గా..
అమరావతి: అసెంబ్లీలో, మీడియా పాయింట్ వద్ద ప్రతిపక్షానికి బాగా కౌంటర్ ఇచ్చిన వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. అదే సమయంలో పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాస రావు వివరణపై అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారు.
గురువారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం టిడిఎల్పీలో చంద్రబాబు అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతల పర్ఫార్మెన్స్ను చంద్రబాబు చదివి వినిపించారు.
ఉత్తమ ప్రశ్న, ఉత్తమ స్పీచ్, కౌంటర్ ఎటాక్, ఉత్తమ ఇంటర్వెన్షన్, మీడియా పాయింట్ వద్ద బాగా మాట్లాడిన వారిని చంద్రబాబు మెచ్చుకున్నారు. నేతల ఫర్ఫార్మెన్స్ రిపోర్టును చదివారు.
యనమల, అనితలకు ప్రశంసలు
మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని, వంగలపూడి అనిత, ఆనంద రావు, జవహర్ తదితరులకు చంద్రబాబు ప్రశంసించారు. నేతలతో పాటు పలు అంశాల్లో తన పర్ఫార్మెన్స్ బాగుందని చంద్రబాబు చెప్పారు.
వైసిపి వల్గర్గా.. చెవిరెడ్డి అరెస్ట్పై..
ప్రతిపక్ష సభ్యులు, పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్గర్గా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదే సమయంలో వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని రెండు రోజుల క్రితం అరెస్టు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చెవిరెడ్డిని అనవసరంగా అరెస్ట్ చేశారన్నారు.
గంటా తీరుపై అసంతృప్తి
మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావుల అంశంపై గంటకు పైగా చర్చ జరిగింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి గంటా సమాధానంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటా వివరణ సరిగా లేనందునే తాను లేచి జవాబు చెప్పానని చంద్రబాబు అన్నారు. శాఖాపరమైన అంశాలు వచ్చినప్పుడు మంత్రులు సీరియస్గా ఉండాలన్నారు.
జగన్పై ఆగ్రహం
ఈ సందర్భంగా చంద్రబాబు వైసిపి అధినేత జగన్పై మండిపడ్డారు. జగన్కు ఆలోచన లేదని, అవగాహన లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన లిటరేచర్ చదవాలని, అవగాహన పెంచుకోవాలన్నారు. అసెంబ్లీలో ప్రతి నిమిషాన్ని వాడుకోవాలన్నారు. పార్టీ నేతలంతా పార్టీకి టైం కేటాయించాలన్నారు.