సింధుకు సన్మానం: 'బాబు పబ్లిసిటీ స్టంట్ ఎక్కువైంది, కేసీఆర్తో అవగాహన'
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రియో ఒలింపిక్స్లో పీవీ సింధుకు రజతం వస్తే తన వల్లే వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చేనా అని నిలదీశారు. కృష్ణా నది పుష్కరాలు తానే తీసుకు వచ్చానని, పుష్కరాలను తానే సాగనంపుతానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ఆయన పబ్లిసిటీ స్టంట్లు మితిమిరిపోయాయన్నారు.
సింధు కోసం ఏపీ ఇలా, తెలంగాణ అలా: అదే తేడా!
రాయలసీమలో కరువుతో రైతులు, నిరుద్యోగం వల్ల యువత అల్లాడుతున్నారన్నారు. ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి పుష్కరాల పేరిట రూ.3500 కోట్లను టిడిపి నేతలు దోచుకున్నారన్నారు.
పుష్కరాల కోసం పది శాతం నిధులను ఖర్చు చేస్తే 90 శాతం నిధులు అధికార పార్టీ జేబుల్లోకి వెళ్లాయన్నారు. పుష్కరాలను భక్తితో నిర్వహించాలని తాము కోరుతున్నామని, కాని సినీ ఫక్కీలో నిర్వహిస్తూ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారన్నారు.
ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య గురించి, గ్యాంగ్ స్టర్ నయీం గురించి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదన్నారు. నయీంను పెంచి పోషించింది చంద్రబాబేనని ఆరోపించారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు రహస్య అవగాహనతో ఓటుకు నోటు కేసును నీరుగార్చాయన్నారు.
కేసీఆర్ కంటే అడుగు ముందు: సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి
ఈ నేపథ్యంలో రెండు కేసుల పైన సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడే నయీంతో సెటిల్మెంట్ చేసుకోమని చెప్పాడంటే ఇంకెంత మంది ఆంధ్రా మంత్రులతో నయీంకు సంబంధాలు ఉన్నాయో అర్థమవుతోందన్నారు. బిల్లీరావు, తేల్గీ వంటి వాళ్లను తయారు చేసింది చంద్రబాబే అన్నారు.