రాత్రి ఆలోచించి రేపు రండి: బాబు సూటి ప్రశ్న, నీళ్లు నమిలిన జగన్ పార్టీ
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు పైన ఆంధ్రప్రదేశ్ శాసన సభలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పట్టిసీమ విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టారు.
రెండో పంటపై హామీ, పట్టిసీమపై చెప్పండి: బాబు సవాల్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టిసీమకు వ్యతిరేకమా కాదా చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు. గోదావరి జిల్లాల్లో ఒకే పంటకు నీరు ఇస్తే... రెండో పంటకు కూడా నీరు ఇవ్వవచ్చునని నాడు చెప్పింది టిడిపియేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చారు.
గోదావరి జిల్లాలో రెండో పంట బాధ్యత తమదే అన్నారు. నీరు ఇస్తామని చెప్పారు. పోలవరం పూర్తి అయ్యాక మూడో పంటకు కూడా నీరు ఇస్తామని చెప్పారు. గోదావరి జిల్లాలకే తమ తొలి ప్రాధాన్యత అన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి పూర్తిగా స్టడీ చేశాక మాట్లాడవలసి ఉంటుందన్నారు. అసలు మీరు పట్టిసీమకు వ్యతిరేకమా? అనుకూలమా?, పట్టిసీమపై మీ స్టాండ్ ఏమిటో చెప్పాలని జగన్ను చంద్రబాబు నిలదీశారు. నేను నేరుగా ఆడుగుతున్నానని చెప్పారు. ఆ తర్వాత మీరు మాట్లాడాలన్నారు.
జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ...
నేను చెప్పేదానిని మీరు తెలుసుకోవాలని కానీ, నన్ను శాసించే హక్కు మీకు లేదని జ్యోతుల నెహ్రూ చెప్పారు. తద్వారా పట్టిసీమ ప్రాజెక్టు పైన దాటవేత ధోరణి అవలంభించారు. ఈ సందర్భంగా టిడిపి సభ్యులు పట్టిసీమ గురించి నేరుగా జవాబివ్వాలని నినాదాలు చేశారు.
టిడిపి సభ్యుల నినాదాల మధ్యనే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదన్నారు. నదుల అనుసంధాన విధానం వ్యతిరేకిస్తున్నామన్నారు. పట్టిసీమ జలాల తరలింపు దుర్మార్గమైన చర్య అన్నారు.
విద్యుత్ ఉత్పాదన కోసమే సీలేరును నిర్మించారని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును ధనార్జన కోసమే చేపట్టారని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు.
బిజెపి సభ్యుడు విష్ణు మాట్లాడుతూ...
బిజెపి నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పట్టిసీమకు వైసిపి వ్యతిరేకమా? అనుకూలమా? అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు.
ధనార్జన ఆరోపణలపై చంద్రబాబు ఘాటు స్పందన
జ్యోతుల నెహ్రూ ధనార్జన ఆరోపణల పైన చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పట్టిసీమ పైన అడ్డదారులు వద్దని, సూటిగా మేం ప్రశ్న వేశామని దానికి సమాధానం చెప్పాలన్నారు. ఏదో ఒక స్టాండ్ చెప్పాలన్నారు. స్టాండ్ లేకుండా మీ పార్టీ ఏమిటయ్యా అన్నారు.
పట్టిసీమ అవసరమా లేదా అనేది మొదట చెప్పాలన్నారు. గోదావరి జిల్లాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. సభ్యులు బాధ్యతగా మాట్లాడాలన్నారు. ఏం మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందనుకోవడం సరికాదన్నారు. సీమకు నీళ్లు కావాలా వద్దా చెప్పాలన్నారు.
నాడు మీరు ధనయజ్ఞం చేశారని, జలయజ్ఞం కాదన్నారు. నాడు కాంగ్రెస్ చేసిన ధనయజ్ఞం వల్ల ఒక్క ఎకరాకు నీరు రాలేదన్నారు. అసలు మీరు పట్టిసీమకు అనుకూలమా, వ్యతిరేకమా అని చెప్పాక ఆ తర్వాత మాట్లాడాలని, ఏదో స్టాండ్ చెప్పే వరకు మీకు మాట్లాడే హక్కు లేదన్నారు.
పట్టిసీమ పైన వైఖరి చెప్పాక.. అవినీతి గురించి మాట్లాడండని, తాము ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, మీరు స్టాండ్ చెప్పాక ఆరోపణలు చేస్తే ఆ తర్వాత మీరు చెప్పింది నిజమే అయితే చర్యలు తీసుకోవాలన్నారు.
పట్టిసీమ గురించి మా(టిడిపి) సభ్యులు అడుగుతున్నారని, మీ స్టాండ్ ఏమిటో చెప్పాలని మళ్లీ అడుగుతున్నానని చెప్పారు. ఈ రోజు చెప్పకుంటే రాత్రికి ఆలోచించుకొని, రేపు వచ్చి చెప్పాలన్నారు. పట్టీసీమకు అనుకూలమా లేక వ్యతిరేకమా చెప్పే వరకు మాట్లాడే అర్హత లేదన్నారు.