సవాల్ చేస్తున్నా: కెఈ వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి తనపై చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. కెఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కర్నూలు జిల్లా అభివృద్ధి విషయంలో తాను సవాల్ చేస్తున్నానని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాకు తాను అభివృద్ధి పనులు చేస్తున్నానని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు.
కర్నూలు జిల్లాకు పరిశ్రమలు, విద్యాసంస్థలు, టౌన్షిప్ తెస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. కెఈ వ్యాఖ్యల వల్ల నష్టం లేదని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు సలహాలు ఉంటే ఇవ్వాలి గానీ ప్రజలను రెచ్చగొట్ట కూడదని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి తన బాధ్యత అని ఆయన అన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఆయన అన్నారు.
కర్నూలులో ఈ రోజు జరిగిన అభివృద్ధి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా జరగలేదని ఆయన అన్నారు. పట్టిసీమ ద్వారా నీటిని రాయలసీమ జిల్లాలకు అందిస్తానని అంటే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నా ప్రజలు రెచ్చిపోకుండా తనకు మద్దతుగా నిలిచారని ఆయన అన్నారు. చేసిన పనులు అర్థం చేసుకుని ఇంకేం చేయాలో చెప్పాలని ఆయన అన్నారు. పార్టీకి ఎవరు బాగా పనిచేశారో వారి పేర్లు కూడా చెబుతానని ఆయన అన్నారు.
రైతుల శ్రేయస్సే ముఖ్యం..
రైతుల శ్రేయస్సే తనకు ముఖ్యమని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం నాడు జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని, రుణమాఫీ ప్రక్రియను సమర్థంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సీఎం, అధికారులకు ఆదేశించారు. మాతా, శిశుమరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు.
సంక్షేమ పథకాలు, రుణవిముక్తి లబ్ధిదారులు, పెన్షన్ లబ్ధిదారుల పేర్లతో గ్రామ కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేయ్యాలని ముఖ్యమంత్రి, అధికారులను ఆదేశించారు. రానున్న 3 నెలల్లోపు గ్రామాల్లో నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కలెక్టర్లు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని, బదిలీల పేరుతో ఉద్యోగులను వేధించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. వడదెబ్బకు ప్రజలు చనిపోకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.