వారి సిఫార్సుతోనే శేఖర్ రెడ్డిని వేశాం: చంద్రబాబు, వార్ధాపై అప్రమత్తం
ఐటి అధికారులకు భారీ మొత్తంతో చిక్కిన శేఖర్ రెడ్డి ఉదంతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
విజయవాడ: పెద్ద మొత్తంలో నగదును, బంగారాన్ని ఆదాయం పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో శేఖర్ రెడ్డి ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తమిళనాడు ప్రభుత్వ సిఫార్సుతో శేఖర్ రెడ్డి టిటిడి పాలక మండలి సభ్యుడిగా నియమించామని ఆయన చెప్పారు.
వార్ధా తుఫానును ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరించడానికి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన శేఖర్ రెడ్డి వ్యవహారంపై స్పందించారు. ఐటి అధికారుల దాడుల నేపథ్యంలో శేఖర్ రెడ్డిని టిటిడి పాలక మండలి నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు.
చట్టంలోని లొసుగులను కొంత మంది అక్రమాలకు వాడుకుంటున్నారని ఆయన అన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు ప్రయోజనం కొంత మంది వల్ల దెబ్బ తింటోందని ఆయన అన్నారు. కొత్త నోట్ల కొంత మందికి అక్రమంగా అందుతున్న విషయంపై అప్రమత్తంగా ఉండాలని తాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పినట్లు ఆయన తెలిపారు.
వార్థా తుఫానుపై ఆయన శనివారం సమీక్ష జరిపారు. వార్ధా తుఫాను ప్రభావాన్ని ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేసినట్లు చంద్రబాబు చెప్పారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు కూడా తెలిపారు.
తుఫాను అంచనాల కోసం ఇస్రోను సంప్రదిస్తున్నామని అన్నారు. తీర ప్రాంత జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగు జిల్లాలకు ఐఎఎస్ అధికారులను పంపిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి చెప్పారు.