జగన్మోహన్ రెడ్డి గారూ అంటున్నా, బయటపడిందనా: బాబు, ఈనాడు సార్, మీ గెజిట్: జగన్
హైదరాబాద్: తాను సభలో చాలా గౌరవంగా వ్యవహరిస్తుంటే, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు బాగా లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాను జగన్మోహన్ రెడ్డి గారూ అని సంబోధిస్తుంటే మీరు మాట్లాడుతున్న తీరేమిటని ఆయన అడిగారు. కాల్ మనీపై చర్చ సందర్భంగా జగన్ ప్రసంగం మధ్యలో జోక్యం చేసుకుంటూ చంద్రబాబు మాట్లాడారు.
"మీ బండారం బయటపడుతుందనా, నీ కార్యకర్తలు బయటపడ్డారనా, ఎందుకు భయపడుతున్నారు, లాలూచీలో కొంత మంది తప్పు చేశారు. వారికి శిక్ష పడాల్సిందే" అని చంద్రబాబు అన్నారు. కాల్ మనీ అత్యంత ముఖ్యమైన విషయమని, కొంత మంది మహిళలపై అత్యాచారాలకూ లైంగిక వేధింపులకూ పాల్పడ్డారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
కాల్ మనీ వ్యవహారంలో 65 మంది వైసిపివాళ్లు, 20 మంది టిడిపి వాళ్లు, 12 మంది కాంగ్రెసు వాళ్లు ఉన్నారని ఆయన చెప్పారు. కాల్ మనీ వ్యవహారంపై ఓ మహిళ పదో తారీఖున ఫిర్యాదు చేస్తే, అది 12న తన దృష్టికి వచ్చిందని, చర్యలు తీసుకోవాలని ఆదేశించానని ఆయన చెప్పారు.
ఆ వ్యవహారంలో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఆయన చెప్పారు. ఏడుగురిపై కేసులు నమోదు చేస్తే దాంట్లో ఎన్నికలకు ముందు వైసిపికి పనిచేసివారు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఎవరూ అడగక ముందే కాల్ మనీ వ్యవహారంపై న్యాయవిచారణకు ఆదేశిస్తామని చెప్పానని ఆయన గుర్తు చేశారు.
35 ఏళ్లుగా తాను వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటున్నాని ఆయన అన్నారు. నిర్దిష్టమైన సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలూ ఎమ్మెల్సీలూ ఉన్నారా, ఉంటే సాక్ష్యాదారాలతో చెప్పాలని, చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎవరినీ వదలిపెట్టబోమని ఆయన అన్నారు.
ఆ తర్వాత జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ - ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ఇలా చేస్తారేమిటని అడిగారు. డ్వాక్రా మహిళల రుణాల గురించి మాట్లాడుతుంటే జగన్ ఒంటిలో వణుకు వస్తోందని ఆయన అన్నారు. తాను మాట్లాడుతే పాలన ఎలా దిగజారిపోయిందో ప్రజలకు తెలుస్తుంది కాబట్టి మాట్లానీయడం లేదని ఆయన అన్నారు.
రెండు నెలల క్రితం చంద్రబాబుకు తాము చెప్పామని, కానీ పట్టించుకోలేదని ఆయన అన్నారు. పత్రికలో అప్పుడు వచ్చిన వార్తలను జగన్ చదువుతుండగా, అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు అభ్యంతర పెట్టారు మీ గెజిట్కు కూడా వస్తా అంటూ చెప్పి ఈనాడు పత్రికలో వచ్చిన వార్తను చదువుతూ ఇది ఈనాడులో వచ్చిన వార్తను చదువుతూ ఇది మీ గెజిట్, ఈనాడులో వచ్చిన వార్త అంటూ చెప్పారు. వెనిగళ్ల శ్రీకాంత్ వ్యవహారం గురించి జగన్ చదువుతుండగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు.