సెక్షన్ 8 కనిపించడం లేదు, హోదానే కనిపిస్తోంది: జగన్కు బాబు చురక
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై తాను ప్రకటన చేస్తున్న సమయంలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వచ్చిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. సెక్షన్ 8 కనిపించడం లేదు గానీ మీకు ప్రత్యేక హోదా మాత్రమే కనిపిస్తోందని ఆయన ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చురకలు అంటించారు. మీ దివాళాకోరు రాజకీయం దాన్ని బట్టే అర్థమవుతోందని ఆయన అన్నారు. హైదరాబాదులో రక్షణ లేదని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వంపై పెత్తనం చేయడానికి లేదని ఆయన అన్నారు.
ఉమ్మడి రాజధాని విషయంలో తన బాధ్యతలను గవర్నర్ సరిగా నిర్వహించడం లేదని ఆయన అన్నారు. హైదరాబాదులో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి రెండు ప్రభుత్వాలకు సమాన ప్రతిపత్తి ఉండాలని ఆయన అన్నారు. ఈ విషయంలో గవర్నర్కు బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు. గవర్నర్ చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు.
అన్ని విషయాలూ మాట్లాడుదామని, తాను తప్పు చేయను, ఎవరికీ భయపడనని ఆయన అన్నారు. ఎపి ప్రయోజనాల కోసం పోరాటం చేయడంలో తమ పార్టీ ప్రభుత్వం ముందుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో తాను వివాదాలకు వెళ్లదలుచుకోలేదని ఆయన అన్నారు. పరస్పరం చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుందామంటే తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాలేదని ఆయన చెప్పారు. ఇరు రాష్ట్రాలు సయోధ్యతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పినా వినడం లేదని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, మిగతా రాష్ట్రాలతో సంబంధం లేదని తాను గట్టిగా చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా గురించి ప్రధానితో మాట్లాడానని, ఎపి ప్రజలకు అన్యాయం జరిగిన తీరును వివరించానని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాను బలహీనపరిచారని, ప్రత్యేక హోదా వస్తేనే సరిపోదని, విభజన చట్టంలోని హామీలను అన్నింటినీ అమలు చేయాలని ఆయన అన్నారు.
పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సాయం అందించాలని ఆయన అన్నారు. 15 నెలల్లో 17 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన వాటిని రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేశానని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ తీర్మానాన్ని చంద్రబాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఎపిని దేశంలో నెంబర్ వన్గా చేసేంత వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రం కుతకుతలాడుతంటే అవిశ్వాస తీర్మానం ఇచ్చి, వెనక్కి తీసుకున్నారని, ఎందుకు అలా చేశారో చెప్పాలని, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సభలో ఉన్నారని, మనకన్నా ప్రజలు తెలివైనవారని, నాయకులు గుర్తించాలని ఆయన అన్నారు. తాను ఎక్కడా రాజీ పడబోనని, తనకు ఏ విధమైన బలహీనతలు లేవని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ రోజు వాజ్ పేయి ప్రభుత్వానికి సహకరించామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నామని, ప్రజలకు మేలు జరగాలంటే అది అవసరమని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంలోని తమ పార్టీ మంత్రులు రాజీనామా చేయాలని అడుగుతున్నారని, ఇది సరైంది కాదని, ప్రజలకు మేలు చేయడానికి సహకరించాలని ఆయన అన్నారు. హామీలను నిలబెట్టుకోవడానికి అను నిత్యం పనిచేస్తానని ఆయన అన్నారు. తాను ఎవరికీ భయపడబోనని, ప్రజల కోసం భయపడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రక్షకుడిగా ఉంటానని ఆయన చెప్పారు.
తనపై కేసులు కూడా లేవని, ఎన్నో కేసులు పెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారని ఆయన అన్నారు. తన నిజాయితీయే తనకు రక్ష అని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చివరి రక్తం బొట్టు వరకు పనిచేస్తానని ఆయన చెప్పారు. ఒక్క మంచి పని కోసం కూడా ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సహకరించలేదని ఆయన అన్నారు.