ఎపిలో భూప్రకంపనలు: చంద్రబాబు సమీక్ష
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో శనివారం భూమి కంపించింది. నేపాల్ను భారీ భూకంపం తాకిన నేపథ్యంలో, ఉత్తర భారతంపై దాని ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దాని ప్రకంపనలు కనిపించాయి.
విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విశాఖలోని మురళీనగర్, అక్కయ్యపాలెంలో భూమి కంపించించినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా భూమికంపించింది.
కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, మామిడికుదురు, కడియంలో భూ ప్రకంపనలు వచ్చాయి. విజయవాడలోని రామలింగేశ్వరనగర్, బెంజిసర్కిల్, గొల్లపూడి, మొగల్రాజపురం ప్రాంతంలో 5 సెకన్లపాటు భూ ప్రకంపనలు సంభవించాయి.
కాగా, రాష్ట్రంలోని కోస్తా జిల్లాలో శనివారం సంభవించిన భూప్రకంపనల తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల పర్యటనల్లో ఉన్న చంద్రబాబు గుండ్లకమ్మప్రాజెక్టు వద్దకు వచ్చారు. ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడిన అనంతరం భూకంపంపై అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ భూకంపాలు వచ్చే అవకాశం లేదని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త చద్దా అన్నారు. నేపాల్తో పాటు మన దేశంలోను, ఏపీలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించిన నేపథ్యంలో చద్దా స్పందించారు. భూమి లోపలి సర్దుబాట్లతో భూకంపం వస్తుందన్న ఆయన, ఏపీలో భారీ భూకంపాలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.