సీఎంలలోనే తొలిసారి!!: హైదరాబాద్లో బాబు నివాసం, విమర్శలు
హైదరాబాద్: హోటల్లో అధికారిక నివాసం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రికార్డ్ సృష్టించారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. చంద్రబాబు కుటుంబం ప్రస్తుతం హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో నివాసం ఉంటోంది.
చంద్రబాబు కుటుంబం తన నివాసాన్ని ఫాంహౌస్ నుంచి హోటల్కు ఇటీవల మార్చింది. హైదరాబాద్ శివార్లలోని మదీనాగూడ వద్ద ఉన్న ఫాంహౌస్లో వీరు నిన్నటిదాకా ఉన్నారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్లోని పార్క్ హయత్ హోటల్కు మారారు.
బాలకృష్ణ రమ్మన్నా నో: హైద్రాబాద్లోని హోటల్లో ఉంటున్న బాబు ఫ్యామిలీ
టిడిపి రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవనకు సమీపంలో ఉన్న పార్క్ హయత్లో పైన విడిగా కొన్ని ఫ్లాట్లు ఉన్నాయి. ఇంటి వాతావరణం మాదిరిగా ఉండి అందులో సొంతంగా వంట చేసుకొనే అవకాశముంది. ఈ కారణంగా చంద్రబాబు కుటుంబం ఈ హోటల్లోకి మారింది.
జూబ్లీ హిల్స్ చెక్పోస్టుకు సమీపంలోని చంద్రబాబు పాత ఇల్లు కూలగొట్టి కొత్త భవనం నిర్మిస్తున్నారు. ఆ ఇల్లు పూర్తి కావడానికి మరో రెండు నెలలు పడుతుందని తెలుస్తోంది. అది పూర్తయ్యే వరకు ఆయన కుటుంబం ఈ హోటల్లోనే ఉండనుంది.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాంశ్ ఇక్కడ ఉండనున్నారు. పలు ఇబ్బందుల నేపథ్యంలో వారు హోటల్లో ఉంటున్నారు. తన ఇంట్లో ఉండమని బాలకృష్ణ ఆహ్వానించినా వారు హోటల్ వైపే మొగ్గు చూపారు.
అయితే, హోటల్లో అధికారిక నివాసం ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన దేశ ముఖ్యమంత్రులలో చంద్రబాబు రికార్డ్ సృష్టించారని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పలు అధికారిక గృహాలను మార్చారు. ఇప్పుడు కొత్తగా హోటల్లోకి మారారు.
ఆయన కుటుంబం హోటల్లోనే ఉంటుంది. చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే సమావేశం కానున్నారని తెలుస్తోంది. తద్వారా ఆయన అధికారిక నివాసం ఈ ఫైవ్ స్టార్ హోటల్ కానుంది.
ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు ప్రముఖులు ఫైవ్ స్టార్ హోటల్లో బస చేయడం జరుగుతుందని, కానీ చంద్రబాబు ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్నే ఏకంగా అధికారిక నివాసంగా మార్చుకున్నారని, ఇలాంటి సీఎం దేశ చరిత్రలో ఎవరూ లేరని అంటున్నారు.
హోటల్ ఖర్చు భారీగా ఉండనుందని, ఇప్పటికే క్యాంప్ కార్యాలయాల పేరిట చంద్రబాబు నిధులు వృథా చేశారని, ఇప్పుడు హోటల్లో ఉంటూ వృథా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ హోటల్లో నెలకు రూ.5 లక్షల ఖర్చు అవుతోందని వార్తలు వస్తున్నాయి.