రోజా వ్యాఖ్యలను జగన్ ఎందుకు ఖండించలేదు?: జూపూడి
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి రావెల కిశోర్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు వేర్వేరుగా అన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరూ అనుకోరని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వెయ్యి కోట్లు విడుదల చేశామని మంత్రి రావెల కిశోర్బాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరిస్తున్నాయని ఆరోపించారు. దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రావెల చెప్పారు.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరించారని, కులాలను రెచ్చగొట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చూస్తోందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు బుధవారం మీడియా సమావేశంలో ఆరోపించారు.
అసెంబ్లీలో దళిత మంత్రి, ఎమ్మెల్యేను అవమానించేలా మాట్లాడిన శాసనసభ్యురాలు రోజా వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. అంబేద్కర్పై చర్చను ఎందుకు అడ్డుకున్నారని విమర్శించారు. అంబేద్కర్ను అవమానించిన పార్టీ వైసీపీ అని ఆయన అన్నారు. ఏపీలో కులాలను రెచ్చగొట్టాలని వైసీపీ చూస్తోందని ప్రభాకర్ అన్నారు.
పల్నాడులో వాటర్ గ్రిడ్
ఎంపీ రాయపాటి సాంబశివరావు తాను దత్తత తీసుకున్న ధర్మవరం గ్రామంలో అభివృద్ధి పనుల కోసం రూ.2 కోట్లు కలెక్టర్కు అందజేశారు. ఏడు మున్సిపాలిటీల్లో కమ్యూనిటీ టాయిలెట్ల ఏర్పాటుకు గెయిల్ ముందుకొచ్చిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పల్నాడులో వాటర్గ్రిడ్ ఏర్పాటుకు కృషి చేస్తామని రాయపాటి చెప్పారు.