కాపులకు అవమానం?: భవనానికి బాబు పేరుపై వివాదం, జగన్కు అవకాశమేనా?
విజయవాడ: కొందరు నేతలు కాపు వర్గాన్ని కావాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపి అధినేత చంద్రబాబునాయుడుకు దూరం చేస్తున్నారా? అంటే ఔననే వాదనే వినిపిస్తోంది. క్షేత్రస్థాయి సమాచారం తెలియనివారే బాబును తప్పదోవ పట్టిస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీకి దన్నుగా ఉన్న కాపులను దూరం చేసుకునే చర్యలను బాబు సన్నిహితులు ప్రోత్సహిస్తున్న తీరును సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, కాపులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.
గుంటూరులో నిర్మించ తలపెట్టిన కాపుభవన్కు చంద్రబాబు పేరు పెట్టడంపై వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కాపు నేతలు, సంఘాలు టిడిపిపై బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఇది తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, తమ కులంలో మహామహులు అనేకమంది ఉండగా, చంద్రబాబు పేరు పెట్టడమేమిటని మెజారిటీ కాపుసంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
కాపు వర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు, రాష్ట్ర కాపు యువసేన అధ్యక్షుడు కర్ణ శ్రీనివాసరావు ఇప్పటికే మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి, కాపుభవన్కు బాబు పేరు పెట్టడం కాపులను అవమానించడమేనని విరుచుకుపడుతున్నారు. ఈ ప్రచారాన్ని టిడిపిని వ్యతిరేకించే కాపుసంఘాలు ఇప్పటికే గ్రామస్థాయికి చేర్చే పనిలో ఉండటం గమనార్హం.
పైగా ఈ ప్రతిపాదనను సమర్ధిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైఖరిని పార్టీలతో సంబంధం లేని కాపులు, సంఘాలు నిరసిస్తున్నాయి. 'ఇది అనవసరంగా కాపులను రెచ్చగొట్టడంతోపాటు, కాపులు టిడిపికి ఎప్పుడు దూరమవుతారా? అని ఎదురుచూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్కు అవకాశం కల్పించడమే అవుతుంది' అని వారు చెబుతున్నారు.
'కాపుభవనానికి వాళ్ల కులానికి చెందిన ప్రముఖుల పేర్లు పెట్టడమే సబబు కదా? మా కుల భవనాలకు మా కుల ప్రముఖుల పేర్లే పెట్టుకుంటాం గానీ మరో కులం వారి పేరు పెట్టం కదా?, కమ్మ సంఘ భవనాలకు వంగవీటి రంగా, ముద్రగడ పద్మనాభం పేర్లు పెడితే ఆ కులం వాళ్లు ఒప్పుకుంటారా? ఇవన్నీ ఒక కులాన్ని కించిపరిచి, వారిని అనవసరంగా పార్టీకి దూరం చేసుకునే చర్యలే కదా? మరి ఇలాంటి సలహాలు బాబుగారికి ఎవరు ఇస్తున్నారో? ఎందుకు ఇస్తున్నారో? వాటిని 'సారు' ఎందుకు అంగీకరిస్తున్నారో అర్ధం కావడం లేదు'ని ఓ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.
తమకు రేపటి ఎన్నికల్లో కాపుల అవసరం ఉందని, ఇలాంటి నిర్ణయాల వల్ల వారు దూరమైతే తమ పరిస్థితి ఏమిటని ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఇతర కులాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సర్కారు పథకాలకు బాబు పేరు పెట్టడం వరకూ ఫర్వాలేదని, కానీ ఒక కుల భవనాలకు మరొక కులం వారి పేర్లు పెట్టడం, కచ్చితంగా వారిని అవమానించడంగానే భావిస్తారని విశ్లేషిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాపుల మద్దతుతో మళ్లీ గెలవాలని భావిస్తున్నప్పుడు, ఇలాంటి నిర్ణయాలు వారిని దూరం చేసుకోవడమేనంటున్నారు. ఆ భవనాలకు కాపుకులంలో పుట్టిన కన్నెగంటి హనుమంతు, మహానటుడు ఎస్వీ రంగారావు, మహానటి సావిత్రి వంటి ప్రముఖులలో ఒకరి పేరు పెడితే కాపులు కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకునే వారని చెబుతున్నారు.
దానికి భిన్నంగా కమ్మ వర్గానికి చెందిన బాబు పేరు పెడితే అది సహజంగానే వారిని అవమానించినట్టవుతుందని అంటున్నారు. ఈపాటి ఆలోచన, విశ్లేషణ కూడా బాబు సలహాదారులకు లేకపోవడం దురదృష్టకరమంటున్నారు.
చంద్రబాబు సలహాదారులు ప్రతిపక్షనేత జగన్కు పనికల్పిస్తున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ఇప్పటికైనా సరైన నిర్ణయంతో తీసుకుని కాపు వర్గాన్ని దూరం చేసుకోకుంటే ఉంటే మంచిదని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.