జగన్ మూర్ఖుడు: అచ్చెన్నాయుడు, చర్చకు సిద్ధమన్న సిఎం
హైదరాబాద్: రాజమండ్రి పుష్కర ఘాట్ ప్రమాదంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ తొక్కి్సలాట మృతులకు సంతాపం ప్రకటించే తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. మూర్ఖుడు ప్రతిపక్ష నేతగా ఉండడం దురదృష్టకరమని అచ్చెన్నాయుడు జగన్పై వ్యాఖ్యానించారు.
పరుష పదజాలం వాడకూడదని స్పీకర్ కోడెల శివప్రసాద రావు మంత్రికి సూచించారు. సంఘటనపై అందరం మాట్లాడుదామని, ప్రతిపక్ష నేత సంయమనం పాటించాలని, అందరం మాట్లాడుదామని అచ్చెన్నాయుడు అన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిస్పందిస్తూ సంతాపాన్ని సంతాపంగా చూడాలని, చర్చకు తాము సిద్ధంగా ఉన్నాని, ఇష్టప్రకారం మాట్లాడడానికి ఇది వేదక కాదని అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ హుందా వ్యవహరించాలని, సమస్యలపై మాట్లాడితే సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
ఎలా చనిపోయారో చెప్పకపోతే ఆత్మలకు శాంతి కలుగుతుందా, ఎలా చనిపోయారో చెప్పినందుకు వివాదం అంటున్నారని జగన్ అన్నారు. చనిపోయినవాళ్లను క్షోభ పెట్టకండని స్పీకర్ కోడెల జగన్ను ఉద్దేశించి అన్నారు. సంతాప తీర్మానం ప్రవేశపెడుతూ చంద్రబాబు తొలుత మాట్లాడారు.
గోదావరి పుష్కర ఘాట్ సంఘటన చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలేసి ఎక్స్గ్రేషియా ప్రకటించామని ఆయన చెప్పారు. అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ పుష్కర ఘాట్లో ప్రమాదం జరగడం చాలా బాధాకరమని, ఆ సంఘటనను తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు
పుష్కర ఘాట్ ప్రమాద ఘటనపై చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ గందరగోళంలోనే సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించింది.