నన్ను ఇష్టమొచ్చినట్లు తిడ్తున్నా మౌనంగా ఉన్నా, వేరేవాళ్లైతేనా: బాబు
చిత్తూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన, పాలనాపరమైన అంశాల పైన కొందరు నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని, కానీ ఓర్పు వహిస్తున్నానని, తన స్థానంలో ఇంకెవరైనా ఉంటే పెద్ద గొడవలే చేసేవారని, తిడుతున్నా మౌనంగా ఉన్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాతే: ముద్రగడకు బోండా షాక్, కాపు రిజర్వేషన్లపై రివర్స్!
పాలనాపరమైన అంశాలు, ఏపీకి హోదా విషయంలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పైన నిప్పులు చెరుగుతున్నాయి. అదే సమయంలో మూడు రోజుల క్రితం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. చంద్రబాబును మెచ్చుకున్నా ప్రభుత్వాన్ని కొన్ని అడగాల్సినవి ఉన్నవని, అలాగే హోదా పైన ఎవరికి భయపడి నిలదీయడం లేదని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సోమవారం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చంద్రబాబు మాట్లాడుతూ.. హోదాపై, పాలనాపరమైన అంశాలపై కొందరు తనను తిడుతున్నారని, అభివృద్ధి, సంక్షేమం దృష్ట్యా తాను ఓర్పు వహిస్తున్నానని అన్నారు.
తన స్థానంలో మరెవరైనా ఉంటే పెద్ద గొడవ చేసేవారన్నారు. ఓ పార్టీ ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడకు వెళ్లి అడ్డుకుంటోందని వైసీపీని ఉద్దేశించి అన్నారు. ఎవరు ఎలా అడ్డుపడినా, ఎన్ని ఆటంకాలు కలిగించినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పారు.