తెలంగాణ ప్రాజెక్టులపై బాబు గర్జన: కెసిఆర్కు బిజెపి అపీల్
గన్నవరం/ హైదరాబాద్: ఎగువన నిర్మించే ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతుండగా ఉదారంగా వ్యవహరించాలని బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ ముఖ్మమంత్రి కె. చద్రశేఖర రావును కోరారు.
ఎగువనుంచి తమ రాష్ట్రానికి రావాల్సిన నీటి కోసం పోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయన కృష్ణా జిల్లా గన్నవరం సభలో శుక్రవారం సాయంత్రం ఆ విధంగా అన్నారు. ఎగువన ప్రాజెక్టులు కడితే తమ రాష్ట్రానికి ఇబ్బంది కలుగుతుందని, ఎగువన కట్టే ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
పోలవరం కాలు ద్వారా బ్రహ్మచెరువుకు నీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదిలావుంటే, ప్రాజెక్టులు నిర్మించే విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సహృదయతతో ఆలోచించాలని బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. రాయలసీమకు నష్టం జరగకుండా చూడాలని ఆయన కెసిఆర్కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతే రాయలసీమ ప్రజలు వలస పోవాల్సి వస్తుందని అన్నారు.
తాను తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ గురించి ఆలోచించడం లేదని ఆయన విమర్శించారు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతానికి నష్టం జరుగుతుందని ఆయన శుక్రవారం హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.