బాలకృష్ణ 'ఎన్టీఆర్' మాట, హైదరాబాద్ పొలిటికల్ రాజధాని: బాబు
హైదరాబాద్: అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, హీరో నందమూరి బాలకృష్ణ గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్నారని అయితే, ఇప్పుడు కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టినట్లయితే అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటామన్నారు.
కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టకపోతే జిల్లాల డీలిమిటేషన్లో అనంతపురం రెండు జిల్లాలుగా ఏర్పడుతుందని, అప్పుడు హిందూపురానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుదామని బాలకృష్ణ అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో చెప్పారంట.
జగన్ది రెండు నాల్కల ధోరణి: చంద్రబాబు
ఏప్రిల్ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి పాలన ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పారు. షెడ్లు నిర్మించి అయినా పాలన సాగిస్తామన్నారు. తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ రాజకీయ రాజధాని మాత్రమే అన్నారు. పోలవరం పైన వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిది ద్వంద్వ వైఖరి అన్నారు.
మంత్రులంతా జనవరి నుండి ప్రతి శనివారం హైదరాబాదులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలంతా సభకు సమయానికి రావాలన్నారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అవినీతిరహిత పాలన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని హితవు పలికారు. పింఛన్లు, రుణమాఫీ, 24 గంటల విద్యుత్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు.
రూ.200 పింఛన్ ఇచ్చిన ప్రభుత్వాలు ఘనంగా చెప్పుకున్నప్పుడు మనం రూ.వెయ్యి ఇచ్చి ఎందుకు చెప్పుకోలేకపోతున్నామన్నారు. రుణమాఫీ విషయంలో సక్సెస్ అయ్యామన్నారు. ఏప్రిల్ నుండి షెడ్లు నిర్మించి అయినా పాలన ఏపీ నుండే కొనసాగిద్దామన్నారు. ఆధార్ అనుసంధానంతో సంక్షేమ పథకాల్లో అవినీతి తగ్గిందన్నారు. ఆత్మహత్యల పైన అందరు పూర్తి సమాచారంతో మాట్లాడాలని సూచించారు.
ఏపీని నాలెడ్జ్ హబ్గా చేస్తాం: గంటా
ఏపీని నాలెడ్జ్ హబ్గా తీర్చి దిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. రాష్ట్రంలోని యూనివర్శిటీల వీసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు భేటీ కానున్నారని, విశ్వవిద్యాలయాల ఉన్నతి, విద్యాభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చిస్తారని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఎంసెట్ పై పూర్తి క్లారిటీ వస్తుందని, ఇంటర్ పరీక్షల మాదిరే ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తే చేయగలిగింది ఏమీ లేదన్నారు.