ట్యాపింగ్పై ఆధారాలు, కెసీఆర్ రెచ్చగొడ్తున్నారు ఐనా: చంద్రబాబు
హైదరాబాద్: ఫోన్ల ట్యాపింగ్పై అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పారు. అయితే ఈ విషయంపై రెండు, మూడు రోజులు సంయమనంతో ఉండాలని, తదుపరి ఏం చేయాలన్న దానిపై అప్పుడు నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.
చంద్రబాబుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, నిఘా విభాగం అదనపు డీజీ అనురాధ, ఏసీబీ డీజీ మాలకొండయ్యలతో శనివారం భేటీ అయ్యారు. ఏపీ, తెలంగాణలకు చెందిన టీడీపీ నేతలతోను విడివిడిగా భేటీ అయ్యారు.
తాజా పరిణామాలపై చర్చించారు. ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఒక ఐఏఎస్ అధికారికి సంబంధం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. వీటిపై పూర్తి ఆధారాలున్నాయని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరించారని, ఆయన రెచ్చగొట్టినంత మాత్రాన మనం కూడా దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నట్లుగా సమాచారం. తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పుడు మీడియాలో లీకులు ఇచ్చి హడావుడి చేసి ఇచ్చిందని చంద్రబాబు అన్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతరులపై ఏపీలోని 13 జిల్లాల పరిధిలో నమోదైన కేసుల విచారణకు గాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏపీ డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సుదీర్ఘంగా భేటీ అయ్యింది.
సిట్ అధిపతి మహ్మద్ ఇక్బాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసుల్లో ఎక్కువగా ఫోను ట్యాపింగ్కు సంబంధించినవే కావడంతో ఆ దిశగా కూడా దర్యాప్తు ముమ్మరం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.