తెరపైకి సాక్షి స్టింగ్ ఆపరేషన్: పేపర్ లీకేజ్పై బాబు, జగన్పై తీవ్ర వ్యాఖ్య
అమరావతి: పదో తరగతి పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం ఓ కుట్రగా కనిపిస్తోందని, సాక్షి స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే నారాయణ విద్యా సంస్థలు తప్పు చేస్తే వారిపైనా చర్యలు తీసుకుంటామని, దీనిపై విచారణకు ఆదేశిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో ఎవరినీ కాపాడాల్సిన అవసరం తనకు లేదన్నారు. గురువారం శాసన సభలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై చర్చ జరిగింది.
వాటర్ బాయ్ ఫోటోలు తీశాడు
ప్రవీణ్ అనే వాటర్ బాయ్ ఫోటో తీసినట్లు ఇన్వెజిలేటర్ చెప్పారని చంద్రబాబు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. దానిని అతను వాట్సాప్ చేశారన్నారు. ఘటన జరిగినప్పుడు ఉన్నది నారాయణ ఉద్యోగులు కాదని, 13 మంది ఇన్వెజిలేటర్లు అని చెప్పారు.
వారంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు. ఇన్వెజిలేటర్, వాటర్ బాయ్ సెల్ ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు. పేపర్ లీకేజీకి, మాల్ ప్రాక్టీస్కు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు.
బురద జల్లే కుట్ర.. ఎవరిది తప్పని తేలితే వారిపై చర్యలు
ప్రతిపక్షం ప్రభుత్వంపై బురద జల్లే కుట్ర చేస్తోందన్నారు. ఎప్పుడు ఏం జరిగిందో పూర్తి సమాచారం ఇవ్వాలని, అందర్నీ అరెస్టు చేస్తామని చెప్పారు. నేను చండశాసనుడిగా ఉంటానని చంద్రబాబు చెప్పారు.
పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎవరిది తప్పు అని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నారాయణ స్కూల్ది తప్పని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఆధారాలుంటే ఇవ్వండి.. సాక్షి స్టింగ్ ఆపరేషన్ కావొచ్చు..
నారాయణ, శ్రీచైతన్య అందరూ మాకు సమానమేనని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదన్నారు. ఆధారాలు ఉంటే ఇవ్వాలని, అరెస్ట్ చేస్తామన్నారు. అలాగే, స్టింగ్ ఆపరేషన్ జరిగిందనే అనుమానం వస్తోందన్నారు. ఆ కోణంలోను దర్యాఫ్తు చేస్తామన్నారు.
స్టింగ్ ఆపరేషన్ అని తేలితే సాక్షి పైన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. సత్యం, శారదా కుంభకోణాలకు పాల్పడ్డ వారు ఆర్థిక నేరస్తులు అన్నారు. జగన్ కూడా ఆర్థిక నేరస్తుడే అన్నారు. పత్రికల పేరుతో తప్పుడు ప్రచారం చేయవద్దన్నారు.
జగన్ ఆర్థిక ఉగ్రవాది..
ఆర్థిక నేరాలకు పాల్పడిన రామలింగరాజు, సుబ్రతారాయ్, హర్షద్ మెహతాల కోవకే జగన్ చెందుతారని చంద్రబాబు అన్నారు. డెమోక్రసీలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తోందన్నారు. జగన్ ప్రతిపక్ష నాయకుడు కాకపోతే, ఈ పోలీసుల దృష్టిలో ఉగ్రవాది అన్నారు. ఆర్థిక నేరస్తుడు తప్ప ఇంకొకటి కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇష్టప్రకారం మాట్లాడితే కాదన్నారు.
ఏదో ఇరవై మంది మెంబర్లు ఉన్నారని ఇష్టప్రకారం విమర్శలు చేయడం కాదని, ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెబుతున్నానని, ఎవరు తప్పు చేసినా ఒక ముఖ్యమంత్రిగా ఎంక్వైరీ చేయిస్తానని చెప్పారు. పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వైసిపి కుట్రగా అనుమానిస్తున్నట్లు చెప్పారు.