చంద్రబాబు క్షమాపణ: అంతా చేసినా కూడా, ఇలా...
వంశధార నిర్వాసితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పారు. మరోవైపు, తనపై విమర్శలు చేస్తున్నవారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
అమరావతి: వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో జాప్యం జరిగినందుకు రైతులకు క్షమాపణ చెబుతున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వంశధార విషయంలో రైతులందరితో మాట్లాడి ప్యాకేజీ ప్రకటించామని, ఆ తర్వాత జీవో కూడా ఇచ్చామని ఆయన చెప్పారు. అయితే ఆ ఉత్తర్వులను అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని, ఇది తనకు ఎంతో బాధ కలిగించిందని అన్నారు.
స్థానిక జిల్లా యంత్రాంగం అలసత్వం వల్ల నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరిగినందుకు చింతిస్తున్నానని చెప్పారు. రైతులకు తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. బాధితులందరికీ మంగళవారం నుంచే నష్టపరిహారం అందించే ఏర్పాటు చేస్తామని అన్నారు.
పోలవరం నిర్మాణ బాధ్యతలకు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నిస్తున్నారని, కానీ కేంద్రం వద్ద అనేక ప్రాజెక్టులు ఉంటాయని, ఆ మహాసముద్రంలో ఇదీ ఒకటవుతుందన్నారు. నిర్మాణ బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వం నెత్తికెత్తుకోవడంతోనే జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు సాకారం కానుందని అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తీరని అన్యాయం చేసిన నేతలు తనకు ఇప్పుడు లేఖలు రాయడం విచిత్రంగా ఉందని విమర్శించారు. తన పాలన గురించి మాట్లాడేవారికి కనీసం సర్పంచ్గా అయినా పనిచేసిన అనుభవం ఉందా? అని ప్రశ్నించారు.
ఒకరికి దొంగలెక్కలు రాయడంలో, కొందరికి నేరాలు చేయడంలో అనుభవం ఉందన్నారు. కొందరికి కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టడం పనిగా మారిందని విమర్శించారు. హోదాకోసం ఆందోళన విషయంలో యువత బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.