గుడ్డు తింటా అందుకే ఇలా: బాబు, రాజధాని ఇన్విటేషన్ ఇలా.., సీఎం సెలక్షన్
గుంటూరు: పదమూడు మత సంప్రదాయాలతో మట్టి తీసుకు వస్తే రాజధానిలో సర్వమత స్మారక స్థూపం నిర్మిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు చెప్పారు. ప్రతి ఊరిలో రాజధాని పండుగ వాతావరణం కనిపించాలన్నారు.
రాజధాని శంకుస్థాపన చారిత్రక ఘట్టంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మన రాజధాని, మన మట్టి - మన నీరు అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. శాప్ ఆధ్వర్యంలో జరిగే అమరావతి జ్యోతి ర్యాలీలో యువత పాల్గొనాలన్నారు.
'ప్రపంచ గుడ్డు దినోత్సవం' సందర్భంగా విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గుడ్డుతో తయారు చేసిన వంటకాలను ప్రోత్సహించాలన్నారు.
గుడ్డు ఉత్పత్తులపై పరిశోధనలు మరింతగా జరగాలన్నారు. రోజూ ఉదయాన్నే గుడ్డు తినటం వల్లే ఉత్సాహంగా ఉంటున్నానని చెప్పారు. వ్యవసాయంలో నష్టాలు పెరిగిన తరుణంలో రైతులు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలన్నారు. కోళ్ల పెంపకం, పాడిపరిశ్రమ వైపు రైతులు దృష్టించాలన్నారు. దేశంలో పౌల్ట్రీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉందన్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా జగన్ పనికిరాడు: కేఈ
వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్రంగా విమర్శించారు. కర్నూల్ జిల్లాలోని కృష్ణగిరి జలాశయం నుంచి కాలువలకు గురువారం నీటిని విడుదల చేసిన సందర్భంగా బహిరంగసభలో మాట్లాడారు. పట్టిసీమ పథకానికి అడ్డుపడిన జగన్ ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
అమరావతి ఆహ్వాన పత్రం ఇదీ..
రాజధాని అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయించిన ఏపీ సర్కారు ఆహ్వాన పత్రం ఎలా ఉండాలన్న విషయాన్ని ఖరారు చేసింది. ప్రధాని చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది.
రాజధాని నగర మ్యాప్, బౌద్ధస్థూపంలోని చక్రం రెండూ ఉంటాయి. ఆ చక్రం దిగువన ఇది రెండు వేల సంవత్సరాల క్రితం నాటిదని ప్రస్తావించారు. ఆపై శంకుస్థాపన సందర్భంగా జరిగే ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు, సమయాలు, వాహనాల పాస్ లను ఆహ్వాన పత్రికలతో పాటు సిద్ధం చేశారు.
మొత్తం పది రకాల డిజైన్లను తయారు చేయగా, వీటిని పరిశీలించిన చంద్రబాబు అత్యుత్తమమని భావించిన కార్డును ఎంపిక చేశారు. ఆపై దీన్ని ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ విజ్ క్రాఫ్ట్కు పంపించారు. ఇవి ముద్రితం కాగానే, రాజధానికి భూములిచ్చిన రైతులకు పంచే బాధ్యతలను ఎమ్మార్వోలకు అప్పగించి, కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు.