మనువడి పుట్టెంటుకలు రద్దు చేసుకున్నారు, నాగదేవత పూజలా: బాబుపై చెవిరెడ్డి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మత విశ్వాసాల మీద నమ్మకం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అపచారం చేశారని, చంద్రబాబు తీరు రాష్ట్రానికి అరిష్టమని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ఈ నెల 8వ తేదీన చంద్రబాబు పెదనాన్న కుమారుడు మరణించాడని, దీంతో ఈ నెల 15వ తేదీన జరగాల్సిన మనవడి పుట్టెంటుకల కార్యక్రమాన్ని చంద్రబాబు రద్దు చేసుకున్నారని చెబుతూ కర్మకాండలు పూర్తయ్యే వరకు శుభకార్యాలు చేయరని, దేవాలయాలకు వెళ్లరని, అలాంటిది చంద్రబాబు రాజధాని శంకుస్థాపన కోసం నాగదేవత పూజలు ఎలా చేస్తారని అన్నారు.
చంద్రబాబు అలా చేయడం రాష్ట్రానికి అరిష్టమని చెవిరెడ్డి అన్నారు. తన ఇంట్లో శుభకార్యాన్ని రద్దు చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వ పూజా కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. మత పెద్దలు ఈ విషయంపై చంద్రబాబును ప్రశ్నించాలని ఆయన కోరారు.
హిందూ మత సంప్రదాయాలను, ఆచారాలను చంద్రబాబు మంట గలుపుతున్నారని, దేవుడంటే భయమూ భక్తీ లేదని, అంతా నాటకమేనని అన్నారు. పెద్దనాన్న కుమారుడి మృతితో అంటులో ఉన్న చంద్రబాబు సాక్షాత్తు టిటిడి కళ్యాణమండపంలో హోమాలూ పూజలూ ఎలా చేస్తారని చెవిరెడ్డి అన్నారు. అంటులో ఉన్న చంద్రబాబు తీసుకుని వచ్చే మట్టి, నీళ్ల వల్ల నూతన రాజధానికి అరిష్టమని అన్నారు.