కాపురం చేయకున్నా నేనే అంటారేమే!: ఏకేసిన బాబు
హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి రగడ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం స్పందించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టులో మొదట కుడిగట్టు నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తారని, ఆ తర్వాత ఎడమ గట్టు ద్వారా ఉత్పత్తి చేస్తారని చెప్పారు. ఎడమ, కుడి గట్టు ఉత్పత్తి కంటే ఎక్కువ స్పిల్ వే ద్వారా వదులుతారన్నారు.
రోజుకు పదకొండు వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాలన్నారు. మిగులు జలాలు ఉన్నప్పుడు ముందు కుడివైపు కేంద్రంలోకి వస్తాయని తెలిపారు. సాగర్ నుండి డిమాండ్ మేరకు 14 రోజులకు ఆరు టీఎంసీల నీరు విడుదల చేయవచ్చునని తెలిపారు.
మిగులు జలాలు ఉంటే ముందు ఎస్ఎల్బీసీకి నీటిని విడుదల చేయాలన్నారు. 854 అడుగులకు దిగువన నీటి మట్టం ఉంటే సాగర్కు, కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వాలన్నారు. ఇలా వచ్చే నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలన్నారు. మిగులు జలాలు ఉన్నప్పుడు ఎడమ గట్టు కేంద్రం ద్వారా ఉత్పత్తి చేయాలన్నారు.
మిగిలు జలాలు లేనప్పుడు ఉత్పత్తి చేయాలంటే 11వేల క్యూసెక్కులు వినియోగించాలన్నారు. అలా వినియోగించిన నీటిని జలాశయానికి పంప్ చేయాలన్నారు. తెలంగాణ ప్రజల విద్యుత్ కష్టాల నేపథ్యంలో తాము 300 మెగావాట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని తెలిపారు.
శ్రీశైలం నీటిని అదనంగా వాడితే రెండు రాష్ట్రాలకు ఇబ్బందులు వస్తాయని చెప్పామన్నారు. ఈ ఏడాది జూలైలో కృష్ణా బోర్డు వద్దకు రెండు రాష్ట్రాలు వెళ్లాయని, 69, 107 జీవోలు అమల్లో ఉంటాయని రెండు ప్రభుత్వాలు అంగీకరించాయన్నారు. అత్యవసర నీటి మట్టం లేకుండా వినియోగిస్తే ఇబ్బందులు వస్తాయని కృష్ణా బోర్డు చెప్పిందన్నారు.
ఒప్పందం ప్రకారం విద్యుత్ ఉత్పత్తి చేయకుండా అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాము ఏపీలో ముందు చూపుతో విద్యుత్ కొన్నామని, విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరైన దృష్టితో ఆలోచించలేదన్నారు. తెరాస ఒక పక్కన మాత్రమే ఉందని అందుకే వారు ఏదైనా మాట్లాడుతారన్నారు.
తెలుగుదేశం పార్టీ మాత్రం తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ అని, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించారని, తెలంగాణ, ఆంధ్రా ఇరువైపులా తమ పార్టీ ఉందన్నారు. తెలంగాణ టీడీపీ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. మీ అసమర్థతను మా పైకి రుద్దవద్దన్నారు. మనం భౌగోళికంగానే విడిపోయామని, మానసికంగా విడిపోవద్దన్నారు.
పార్టీ కార్యాలయాన్ని ఎలా తగులబెడతారన్నారు. తెలంగాణలో విభజన చట్టం పైన చర్చ జరగాలన్నారు. చట్టంలో ఏముందో అందరికీ చెప్పాలన్నారు. విద్యుత్ రాకపోయినా, నీళ్లు రాకపోయినా నేనే కారణమంటే ఎలా అన్నారు. రేపు కాపురం చేయకపోయినా నేనే కారణం అంటారేమోనని ఎద్దేవా చేశారు. కరువుకు కూడా నేనే కారణం అవుతానా అని ప్రశ్నించారు.
టీడీపీ కృషి వల్లే తెలంగాణలో, హైదరాబాదులో ఆదాయం పెరిగిందన్నారు. తన వల్లే హైదరాబాదుకు సంస్థలు వచ్చాయని, ఇది ప్రపంచానికి తెలుసునన్నారు. అభివృద్ధిలో పోటీ పడదాం తప్ప గిల్లికజ్జాలు వద్దన్నారు. ఇది పద్ధతి కాదన్నారు. పవర్ మేనేజ్ మెంట్ చేయలేక తమ పైకి తప్పులు నెడతారా అన్నారు.
తమ వద్ద విద్యుత్ సర్ ప్లస్లో ఉంటే ఇచ్చే వాణ్ణని, తమ వద్ద లేదని, ఆరు రూపాయలు పెట్టి కొంటున్నామన్నారు. ఇరవై నాలుగు గంటలు తననే విమర్శిస్తే ఎలా అన్నారు. బురద జల్లే ఆలోచన మానుకోవాలన్నారు. మీరు కష్టపడితే నేను కూడా సహకరిస్తానని చెప్పారు. చట్ట ప్రకారం వెళ్లాలన్నారు.
అంతేకాని, బ్లాక్ మెయిల్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. విభజన చట్టం అన్యాయంగా ఉందని గుర్తించే కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారన్నారు. మీ అసమర్థతను నాపై రుద్దుతారా అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్రాలు విడిపోయాయని, కలిసి నడుద్దామన్నారు. కేసీఆర్ ఉద్దేశం టీడీపీ తెలంగాణలో ఉండవద్దనే అన్నారు. టీడీపీ అధ్యక్షుడిగా ఇరు ప్రాంతాల బాధ్యత తన పైన ఉందని, సీఎంగా ఏపీకి న్యాయం చేయాల్సి ఉందన్నారు.