నేడు తోటపల్లి రిజర్వాయర్ వద్ద: ప్రాజెక్టుల వద్ద బాబు పడక
హైదరాబాద్: కాలువ గట్లపైన పడుకొని మరీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పర్యవేక్షిస్తానని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచే దాన్ని ప్రారంభిస్తున్నారు. సాగునీటి పనుల పర్యవేక్షణ కోసం ఆయన మూడు రోజులపాటు వరుసగా విజయనగరం, చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రాత్రి బసను కూడా ఆయా ప్రాజెక్టుల వద్దే ఏర్పాటు చేసుకొంటున్నారు.
ఇప్పటివరకూ ఖరారైన కార్యక్రమం ప్రకారం - బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు రాత్రి తోటపల్లి రిజర్వాయర్ ప్రాంతంలో బస్సులో బస చేస్తారు. గురువారం ఉదయం అక్కడి నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు వెళ్తారు. ఆ జిల్లాలో మదనపల్లి ప్రాంతంలో జరుగుతున్న హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ పనులు పరిశీలిస్తారు. రాత్రికి ఆ కాలువ పనులు జరిగే ప్రాంతంలోనే కాలువ గట్టు సమీపంలో బస చేస్తారు.
శుక్రవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరి కడప జిల్లాకు వెళ్తారు. ఆ జిల్లాలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అయితే, ఆ రాత్రి అక్కడ బస చేస్తారా లేక హైదరాబాద్ తిరిగి వస్తారా అనేది ఇంకా ఖరారు కాలేదు.
కాగా, బుధవారం రాత్రి తోటపల్లి రిజర్వాయర్ వద్ద బస చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తొలుత పోలీస్ అధికారులు వ్యతిరేకించారు. ఆ ప్రదేశం ఒడిశా రాష్ట్రానికి సమీపంలో ఉందని, అక్కడ నక్సల్స్ దళాల సంచారం ఉన్నందువల్ల అంత మారుమూల ప్రదేశంలో ముఖ్యమంత్రి బస చేయడం ససేమిరా కుదరదని వారు తేల్చి చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయానికి, పోలీస్ అధికారులకు మధ్య మంగళవారం అనేకసార్లు చర్చలు జరిగాయి.
తుదకు, సీఎం రాత్రి బసను తోటపల్లి రిజర్వాయర్ వద్ద కాకుండా దానికి కొంత దూరంలో రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్ద ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కార్యాలయం అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.