రెచ్చగొట్టాలని చూస్తారు, వైసిపితో జాగ్రత్త: ఎమ్మెల్యేలతో చంద్రబాబు
హైదరాబాద్: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శాసనసభలో రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సూచించారు. తాము కష్టపడి పనిచేస్తున్నామనిస ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా చెప్పటానికి సమాధానం తమ దగ్గర ఉందని ఆయన అన్నారు.
తాము ప్రతిపక్షం కోసం కాకుండా ప్రజలకు వాస్తవాలు వివరించటానికి శాసనసభా సమావేశాలను వినియోగించుకోవాలని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు సంసిద్ధం కావాలని, సంయమనం పాటించాలని అని చంద్రబాబు వారికి చెప్పారు. సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సకాలంలో హాజరు కావాలని ఆయన అన్నారు.
అన్ని అంశాలపై ముందుగా కసరత్తు చేసుకుని రావాలని ఆయన ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరు కొత్త బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అవినీతిపరుల అక్రమాస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందేలా చట్టసవరణ బిల్లు ఇందులో ముఖ్యమైందని అన్నారు.
రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతించే బిల్లు, సాగునీటి సంఘాలకు ఎన్నికలు కాకుండా ఏకాభిప్రాయంతో కార్యవర్గాలను ఎంపిక చేయటానికి ఉద్దేశించిన బిల్లు, ఈ-ట్రేడింగ్కు అనుమతించే బిల్లులు ఇందులో ఉన్నాయి.