ఒక్కసారే చెప్తా: జేసీకి చంద్రబాబు హెచ్చరిక! బాలకృష్ణ నియోజకవర్గం పైనా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల వరుసగా పార్టీ నేతలకు క్లాస్ తీసుకుంటున్నారు. తాజాగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల వరుసగా పార్టీ నేతలకు క్లాస్ తీసుకుంటున్నారు. తాజాగా.. విభేదాలతో రచ్చకు ఎక్కితే ఊరుకునేది లేదని అనంతపురం నేతలను హెచ్చరించారు.
అనంతపురం జిల్లాలో జేసీ వర్గం - ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలు కనిపించిన విషయం తెలిసిందే. వారే కాదు, పలువురు నేతల మధ్య వివాదం కనిపించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ నేతలకు హెచ్చరిక జారీ చేశారు.
పార్టీలో ఏ స్థాయి నాయకులైనా క్రమశిక్షణ పాటించాల్సిందేనని, వ్యతిరేక కార్యకలాపాల్ని సహించనని, ఎవరికైనా ఒకసారి చెబుతానని, రెండోసారి కఠిన చర్యలు తప్పవని, మీ మధ్య సమస్యలుంటే తన దృష్టికి తేవాలని, విభేదాలతో రచ్చకెక్కతే ఊరుకునేది లేదన్నారు.
విభేదాలున్న నాయకులకు విడిగా క్లాస్
విభేదాలున్న నాయకులతో చంద్రబాబు విడిగా సమావేశమై వారికి క్లాస్ తీసుకున్నారు. ఒకరి నియోజకవర్గంలో మరొకరి జోక్యాన్ని సహించబోనన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించే పత్రికల్లో ఎక్కువ ప్రతికూల కథనాలు వచ్చాయని, అందుకే మొదట వారినే పిలిపించానని చెప్పారు.
జేసీ, బాలకృష్ణ గైర్హాజరు
చంద్రబాబు శనివారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో అనంతపురం జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీల్లో నియోజకవర్గ ఇంచార్జులుగా ఉన్నవారినే అనుమతించారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తప్ప జిల్లాకు చెందిన మిగతా వారంతా హాజరయ్యారు. రెండు గంటల పాటు భేటీ అయ్యారు.
పత్రికల్లోని విమర్శలను ముందు వేసి మరీ..
మొదట అందరినీ కూర్చోబెట్టి చంద్రబాబు సమీక్ష జరిపారు. ఆ తర్వాత విభేదాలు, జిల్లాలోని సమస్యల పైన చర్చించారు. పార్టీకి చెందిన ఇరువురు నేతలు పత్రికల్లో చేసుకున్న విమర్శలను ఆయన ముందేసుకొని మరీ క్లాస్ తీసుకున్నారు.
నమ్మకంతో ఆదరించారు
అనంతపురం జిల్లా ప్రజలు ఎంతో నమ్మకంతో టిడిపిని ఆదరించారని, మన నడవడిక, కదలికలు, పనితీరుని ప్రజలు గమనిస్తుంటారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా నడుచుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.
జేసీ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ హిందూపురం దాకా..
జేసీ నియోజకవర్గం తాడిపత్రి, బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంతో పాటు కదిరి, ధర్మవరం వంటి చోట్ల నాయకుల మధ్య విభేదాల గురించి పత్రికల్లో ఎక్కువగా ప్రతికూల కథనాలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. పార్టీ ప్రతిష్ట పెంచేలా ఉండాలని హితవు పలికారు. రెండేళ్లపాటు ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చానని, ఇక పార్టీపై దృష్టి పెడతానని తెలిపారు.
జగన్పై ఎదరుదాడి చేసిన విధంగా..
వైసిపి అధినేత జగన్ ఉరవకొండలో సభ ఏర్పాటు చేసి, సాగునీటి ప్రాజెక్టులపై విమర్శలు చేస్తే జిల్లాలోని పార్టీ నాయకులంతా సమష్టిగా విలేఖరుల సమావేశం నిర్వహించి ఎదురుదాడి చేశారని, అదే విధానం కొనసాగించాలని చంద్రబాబు సూచించారు.
పరిటాల సునీతకూ..
ఆ తర్వాత, ముఖ్యమంత్రి జిల్లాలో విభేదాలున్న మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణలను కూర్చోబెట్టి మాట్లాడారు. సూర్యనారాయణ నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని సునీతకు సూచించారు. సంయమనంతో వ్యవహరించాలని సూర్యనారాయణకు హితవు చెప్పారు.
కూర్చుండబెట్టి మాట్లాడారు
పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం విషయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బికె పార్థసారథి, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మధ్య విభేదాలుండటంతో వారిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. కదిరి ఎమ్మెల్యే చాంద్బాషా, నియోజకవర్గ ఇంచార్జి కందికుంట ప్రసాద్ మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో వారినీ కూర్చోబెట్టి మాట్లాడారు.
జేసీ ప్రభాకర్ను పిలిచి..
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాకపోవడంతో, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఒక్కర్నే పిలిచి మాట్లాడారు. సమస్యలన్నీ తాను పరిష్కరిస్తానని, విభేదాలు విడిచి కలసి పనిచేయాలని తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో ఇటీవలి పరిణామాన్ని ప్రస్తావిస్తూ ఎవరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు.