నేను నిప్పులో దూకమంటే వాళ్లు దూకేవారు, మీరు మాత్రం!: చంద్రబాబు
అమరావతి: అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరును చూస్తున్నానని, గతంలో మాధవ రెడ్డి, ఎర్రన్నాయుడు, బాలయోగి వంటి వారు నిప్పుల్లో దూకమన్నా దూకేవారని, ఇప్పటి మంత్రులు అలా లేరని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు.
నిప్పుల్లో దూకమంటే దూకేవారు
ఈ సందర్భంగా చంద్రబాబు పాత రోజులను గుర్తుకు చేసుకున్నారు. అప్పట్లో మంత్రివర్గ సహచరులు తాను నిప్పులో దూకమన్నా దూకేలా ఉండేవారని, ఇప్పుడలా లేరని చెప్పారు.
మాధవరెడ్డి, ఎర్రన్న సహా.. వద్దంటే పోటీ చేయలేదు
1995లో మంత్రివర్గంలో ఉన్న మాధవ రెడ్డి, ఎర్రన్నాయుడు, బాలయోగి వంటివారు నేను ఏం చెప్పినా వేగంగా స్పందించేవారని, ఎనిమిది మంది మంత్రులను లోకసభ ఎన్నికల్లో పోటీ చేయమంటే ఎదురు చెప్పలేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడున్న మంత్రుల్లో ఆ స్ఫూర్తి కొరవడిందన్నారు.
భూమా మృతికి
టిడిపి శాసనసభాపక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. మొదట దివంగత శాసనసభ్యుడు భూమా నాగి రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమా మృతికి శాసనసభలో సంతాప కార్యక్రమాన్ని వైసిపి సభ్యులు బహిష్కరించడాన్ని గర్హించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే సంతాప తీర్మానం వ్యతిరేకించడం, సభకు రాకపోవడం దేశ చరిత్రలో ఎన్నడూ లేదని, ఈ ఘనత వైసిపికే దక్కుతుందన్నారు.
మెదడు కంప్యూటర్లా పనిచేయాలి
శాసనసభ, మండలిలో మంత్రులు, టిడిపి సభ్యుల్లో బాగా మాట్లాడిన వారిని, ప్రతిపక్షం విమర్శలను దీటుగా తిప్పికొట్టిన వారిని, మీడియా పాయింట్లో బాగా మాట్లాడిన వారిని ప్రతిరోజు అయిదుగిరిని ఎంపిక చేసి అవార్డులిస్తానని చంద్రబాబు ప్రకటించారు.
సమాచారం అడిగిన చంద్రబాబు
మంగళవారం సభలో బాగా మాట్లాడిన సభ్యుల వివరాలు సిద్ధం చేశారా? అని టిడిపి కార్యాలయ వర్గాలను చంద్రబాబు అడిగారు. ఇంకా సిద్ధం కాలేదని వారనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఆయన సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి సమాచారం పార్టీ కార్యాలయం నుంచి రాదని, సభ్యులు కూడా అధ్యయనం చేయాలని, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు.
మెదడులా పని చేయాలి
ప్రతి ఒక్కరి మెదడు కంప్యూటర్లా పని చేయాలని చంద్రబాబు అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారని, అదే సమయంలో మన ప్రవర్తన గమనిస్తుంటారన్నారు. బాగా పని చేస్తే 80 శాతం ఫలితాలు కష్టమేమీ కాదని ఇటీవలి యూపీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నారు. అలాంటి ఫలితాలు సాధించాలన్నదే తన తాపత్రయమన్నారు.