పప్పు-లోకేష్: 'బాబు గూగుల్ను మూయిస్తారా?, జేసీ అక్కడ ఉమ్మేస్తున్నారు'
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీలో సోషల్ మీడియాను నిషేధించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సోషల్ మీడియాలో విమర్శలు తట్టుకోలేక అణచివేస్తున్నారని దుయ్యబట్టారు.
'బాబు, లోకేష్లకు సోషల్ మీడియా భయం', కేసు పెడతానని రవికిరణ్ భార్య
గూగుల్లో పప్పు అని టైప్ చేస్తే నారా లోకేష్ ఫోటో వస్తోందని, మరి అలాంటప్పుడు గూగుల్ను చంద్రబాబు మూయించివేస్తారా అని ప్రశ్నించారు.ఫిఫ్త్ ఎస్టేట్గా మారిన సోషల్ మీడియా అంటే చంద్రబాబు వణికిపోతున్నారన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ప్రజల గొంతుకకు సంకేళ్లు వేస్తోందన్నారు. అన్యాయాన్ని సోషల్ మీడియాలో ఖండిస్తే జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. భావప్రకటన స్వేచ్ఛను హరించివేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు తగినరీతిలో బుద్ధి చెబుతారన్నారు. సీఎం చంద్రబాబు కులాల కుంపటి రాజేసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారన్నారు. సొంత పార్టీ నాయకులను ఇతర నేతలతో తిట్టిస్తున్నారన్నారు.
జేసీ దివాకర్ రెడ్డిపై భూమన నిప్పులు
జేసీ దివాకర్ రెడ్డి వాడేదీ రాక్షస భాష అని భూమన అన్నారు. ఆయన వాడే భాషను ఎవరూ హర్షించరని చెప్పారు. జగన్పై జేసి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. జేసీ వ్యాఖ్యలు రాయలసీమ భాషను అవమానించేలా ఉన్నాయన్నారు. వ్యక్తిగత లాభం కోసం సూర్యుడిపై జేసీ ఉమ్మేస్తున్నారన్నారు.