ముద్రగడది ఏంభాష, అందుకే తెలంగాణతో గొడవ: బాబు, బీజేపీపై అసహనం
విజయవాడ: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ల విషయమై ముద్రగడ టిడిపిని చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కాపు నేత ముద్రగడ, మాజీ ఎంపీ హర్ష కుమార్ కలిశారు. వారు కొత్త పార్టీ అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. కాపు ఉద్యమానికి తోడు, దళిత అన్యాయం అని కొత్తగా తెరపైకి రావడం, అలాగే వారి మధ్య కొత్త పార్టీ అంశం చర్చకు వచ్చింది.
ఇది చంద్రబాబును మరింత ఆగ్రహానికి, ఆవేశానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన ముద్రగడ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ ఇప్పుడు రోజూ తన జాతి అంటూ కాపుల గురించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లూ ఆయన ఎందుకు నోరు మెదపలేదని బాబు అన్నారని సమాచారం.
అప్పుడు కాపులు ఆయన జాతి కాదా? కాంగ్రెస్ అప్పుడు తన మేనిఫెస్టోలో వారికి రిజర్వేషన్లపై వాగ్దానం చేయలేదా? ఈ ఉద్యమాలు, లేఖలు ఆనాడు ఏమయ్యాయని బాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
తిరుపతిలో జరగనున్న మహానాడులో ప్రవేశ పెట్టవలసిన తీర్మానాలపై సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముద్రగడ తనకు రాసిన లేఖ చర్చకు వచ్చింది.
టిడిపిని దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థుల చేతిలో ముద్రగడ కీలుబొమ్మగా మారినట్లు అనిపిస్తోందని, ఆయన రాస్తున్న లేఖల్లోని భాష సంస్కారవంతంగా లేదని నేతలు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. విభజన తర్వాత ఏపీ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మహానాడును వేదికగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. టీడీపీ ఎన్నికల ప్రణాళికలో ఇంకా అమలు కాని ఒకటి రెండు హామీలను ప్రతిపక్షాలు పదేపదే ఎత్తిచూపించే ప్రయత్నం చేస్తున్నాయని, కానీ ప్రణాళికలో లేని వాటిని కూడా అనేకం ఇప్పటికే అమలు చేశామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నో చేస్తున్నామన్నారు.
ప్రభుత్వం చేసే ప్రతి పనినీ అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని, రాష్ట్రం నష్టపోయినా పర్వాలేదుగాని టీడీపీకి మంచి పేరు రాకూడదన్నది వారి ధ్యేయంగా కనిపిస్తోందన్నారు. విభజన సమయంలో జరిగిన ద్రోహం వల్లే ఇప్పుడు ప్రతి రోజూ అనేక అంశాలపై తెలంగాణతో తగాదాకు దిగాల్సి వస్తోందని, ఆ రోజు శాస్త్రీయంగా విభజన చేసి ఉంటే ఇప్పుడు ఈ తగాదాలకు ఆస్కారం ఉండేదే కాదన్నారు.
విభజన చేసే రోజు రెండు రాష్ట్రాలకు నష్టం లేకుండా ఎలా చేయాలన్నది కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదని, సోనియాతో కుమ్ముక్కై బెయిల్ తెచ్చుకున్న జగన్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న తనతో కనీసం చర్చించలేదన్నారు. ఎవరితో మాట్లాడకుండా విభజించారన్నారు.
బీజేపీ నాయకులు చాలా చేశామని చెబుతున్నారని, మనకు ఏం వచ్చిందో ఏం రాలేదో ప్రజలకు వివరిద్దామని, ఇంకా రావాల్సిన వాటి కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దామని, కేంద్రంతో తెగతెంపులు అవసరం లేదని, అది రాష్ట్రానికి నష్టమని, మిత్రపక్షంగా ఉంటూనే సాదిద్దామని చంద్రబాబు అన్నారు.
గంటా ఆగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కాపు నాయకుడు ముద్రగ పద్మనాభం రాసిన లేఖపై మంత్రి నారాయణ తీవ్రంగా స్పందించారు. నెలకో లేఖ, పక్షానికో ప్రెస్మీట్ ద్వారా ముద్రగడ జగన్ అజెండాను కాపుల మీద రుద్దడం బాధాకరమన్నారు.
మంజునాథ కమిషన్ పని ప్రారంభించిన తరుణంలో లేఖ రాయడం కాపుల్లో అయోమయాన్ని సృష్టించడమే అవుతుందన్నారు. జగన్కు మౌత్పీస్లా మారిన ముద్రగడ స్థాయిని దిగజార్చుకుంటున్నారన్నారు.
పేద కాపుల కోసం ఎనిమిది పథకాలు ప్రకటించడం, వరాలు కురిపించడం బాధ కలిగించిందా? అంటూ ముద్రగడను ప్రశ్నించారు. ముద్రగడ కొంత మంది చేతిలో కీలుబొమ్మలా మారారని మంత్రి గంటా మంగళవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయనకు ఇవన్నీ గుర్తుకు లేవా అని ప్రశ్నించారు.