కేంద్రంపై బాబు అసంతృప్తి, మనం మనుషులమే కాదని వ్యాఖ్య
విజయవాడ: కృష్ణా పుష్కరాలకు కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నాడు ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా కృష్ణా పుష్కరాల పనులపై సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో కృష్ణా పుష్కరాలు, వనం-మనం కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరిగింది. మొక్కలు పెంచకుంటే మనం మనుషులమే కాదన్నారు. అలాగే, కృష్ణా పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధుల ఇవ్వకపోవడం సబబు కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
కేజీ బేసిన్లోని గ్యాస్ను రాష్ట్ర అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయాన్ని తాను నేరుగా కేంద్రానికి తెలియజేశానని సీఎం చెప్పారు. రేషన్ డీలర్లకు కమీషన్ క్వింటాకు రూ.70 పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ బేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
కృష్ణా పుష్కరాలపై ఆగ్రహం
కృష్ణా పుష్కరాల పనుల్లో అలసత్వం పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యంపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆయన కేబినెట్లో ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
కృష్ణా పుష్కరాలపై ఆగ్రహం
పనులను నామినేషన్ల పద్ధతిన ఇవ్వవద్దని, టెండర్లకు వ్యవధి తగ్గించాలని చంద్రబాబు సూచించారు. నామినేషన్ పద్ధతిలో ఇస్తే చెడ్డపేరు వస్తుందన్నారు.
రేషన్ డీలర్ల కమీషన్ పెంపు
రేషన్ డీలర్ల కమీషన్ రూ.20 నుంచి రూ.70కి పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే, రేషన్ రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.
మొక్కల పెంపకం
ఈ నెల 29వ తేదీన వనం - మనం ద్వారా కోటి మొక్కలు నాటనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. సమాజం, వాతావరణం, ప్రకృతిని పరిరక్షించుకోవాలన్నారు.
మొక్కల పెంపకం
ప్రభుత్వ కార్యక్రమాల్లో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. మొక్కలు పెంచకుంటే మనం మనుషులమే కాదన్నారు. వనం - మనం కార్యక్రమంలో అధికారుల తీరును బట్టి పదోన్నతులు, ఇంక్రిమెంట్స్, బదలీల్లో ప్రాధాన్యం ఉంటుందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా మార్పులు రావాలని చంద్రబాబు అన్నారు. రాజధానిలో పేదల ఆరోగ్యంపై ప్రభు త్వం దృష్టి సారించిందన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. స్వచ్చంధంగా వైద్యం చేసేందుకు ముందుకు వచ్చే డాక్టర్లకు ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా పేమెంట్ ఇస్తామన్నారు.
ఆర్గానిక్ కంపెనీ
శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రా ఆర్గానిక్ కంపెనీకు 3.5 ఎకరాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కృష్ణా జిల్లాలో రూ.23 కోట్లతో ఐఐపీఎం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం సహకారంతో ఉంటుందన్నారు.