షరతుతో తెరాసలోకి..: ఎమ్మెల్యేపై బాబు అసహనం, కలిసేందుకు నో!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కూకట్ పల్లి శాసన సభ్యుడు మాధవరం కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతారనే ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం.
తాను కలుస్తానని ఎమ్మెల్యే కృష్ణారావు పార్టీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేశారని, ఆయితే, తాను బిజీగా ఉన్నానని, తర్వాత కలవాలని సూచించారని తెలుస్తోంది. చంద్రబాబు ఆయనతో మాట్లాడేందుకు నిరాకరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గురువారం నాడు ఉదయం మాధవరం కృష్ణారావు అధినేతను కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా మరోసారి తాను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీల జాబితా నుండి తొలగించిన 26 కులాలను తిరిగి బీసీల్లో చేర్చతే తాను తెరాసలో చేరుతానని చంద్రబాబు నివాసం ముందు అన్నారు.
తెరాసలో చేరినంత మాత్రాన తాను తిరిగి గెలుస్తాననే నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. తనను నమ్మి ఓటేసిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని చెప్పారు. చంద్రబాబు దైవంతో సమానని కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబును తాను శుక్రవారం కలుస్తానని, తాజా పరిస్థితులను వివరిస్తానని చెప్పారు.
తన నియోజకవర్గం ప్రజల కోసం తాను పోరాడుతానని చెప్పారు. తెరాసలో చేరితో ఓడుతానని తెలుసునని, అయితే తన ఒక్కడి కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యల పైన చంద్రబాబు ఒకింత అసహనంతో ఉన్నారని తెలుస్తోంది.