ఇలాగైతే ఎలా: చంద్రబాబు అసహనం, ఆగ్రహం, వర్చువల్ ఇన్స్పెక్షన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పనుల జాప్యం పైన సోమవారం నాడు ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఆయన క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్ ఇన్ స్పెక్షన్ నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా సాగకపోవడంపై చంద్రబాబు నిర్మాణ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వారం సమీక్షిస్తున్నా ఆశించిన స్థాయిలో పనుల్లో పురోగతి ఉండటం లేదన్నారు. పురోగతి వివరాలను నిర్మాణ ప్రాంతం నుంచి వర్చువల్ ఇంటరాక్షన్ పద్ధతిలో అధికారులు తెలిపారు.
నిర్మాణ సంస్థల వైఫల్యం వల్లే స్పిల్వే, స్పిల్ ఛానల్, పవర్హౌస్ తవ్వకం పనులు ఆలస్యమయ్యాయని ఈ సందర్భంగా చంద్రబాబు మండిపడ్డారు. ఇకపై పనులు మందకోడిగా సాగితే సహించేది లేదన్నారు. ఇబ్బందులు, సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించి ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలన్నారు.
పెండింగ్లో ఉన్న రూ.110 కోట్ల బిల్లులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. పోలవరం నిర్మాణానికి నిధుల కొరత లేదని, ప్రాజెక్టుకు నష్టం కల్గించేలా అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. పనుల్లో పురోగతిపై తనకు రోజువారీగా తెలియజేయాలని అధికారుల్ని ఆదేశించారు.
బ్యాక్లాగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు యంత్రాలను వినియోగించి, అదనపు గంటలు పని చేయాలని ఆదేశించారు. స్పిల్వే తవ్వకం పనులు వచ్చే ఏడాది జనవరి నాటికి, స్పిల్ ఛానల్ తవ్వకం పనులు మే నాటికి, పవర్ హౌస్ తవ్వకం పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు.
ఈ ఏడాది చివరికల్లా గేట్ల డిజైన్లు రూపొందించి అనుమతులు పొందాలన్నారు. వచ్చే సమీక్షలో పనుల పరోగతిని పర్యవేక్షించడంతో పాటు, నిర్మాణ సంస్థలకు చెల్లింపులపైనా చర్చించనున్నట్లు చెప్పారు.
మరోవైపు, ప్రాజెక్టు పనుల గురించి చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడంపై అధికారులు వివరణ ఇచ్చారు. సైట్కు పూర్తి స్థాయిలో సంబంధిత మిషనరీ చేరకపోవడంతో పనుల్లో జాప్యం జరిగిందన్నారు. జనవరి నాటికి స్పిల్ వే, మార్చి నాటికి పవర్ హౌస్ పనులు, మే నాటికి స్పిల్ చానల్ తవ్వకం పనులు పూర్తి చేయాలని, ఏడాది చివరికి గేట్ల డిజైన్లపై అనుమతులు పొందాలని చంద్రబాబు ఆదేశించారు.